అధ్యాయం 68

కపాల మోక్షం అంటే ఏమిటి ?

అసలు కపాలమోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే అరుణాచలక్షేత్ర రమణమహర్షి సమాధి చెందినప్పుడు వారి బ్రహ్మ రంధ్రము నుండి నీలిరంగు జ్యోతి ఆకారము ఒకటి బయటికి వచ్చి ఆకాశములో లీనమైనట్లుగా చాలా భక్తులు దీనిని చూసినట్లుగా చెప్పడం జరిగినది.

ఇది ఇలాయుండగా ఒకరోజు ఆంధ్రజ్యోతి తెలుగు పేపరులో ఒక మహిమాన్విత అవధూత ఏవిధంగా కపాలమోక్షం పొందినారో చెప్పే అంశము వచ్చినది.దానిని యధావిధిగా ఇక్కడ పెట్టడము జరిగినది.నాతోపాటుగా మీరుగూడ చదివి తెలుసుకొండి.

మహిమాన్విత అవధూత! 
29-03-2019 02:19:33

కేవలం 32 సంవత్సరాలు జీవించి, ఎక్కువ కాలం తపస్సులోనే గడిపి, కపాలమోక్షం ద్వారా దేహాన్ని చాలించిన అవధూత మొగిలిచర్ల శ్రీదత్తాత్రేయ స్వామి. సమాధి నుంచే భక్తుల మనోరథాలను నెరవేరుస్తాననీ, జ్ఞానబోధ చేస్తానని ఆయన ప్రకటించారు. ఏటా ఆయన భక్తులు మాలధారణతో మండల దీక్ష చేసి, స్వామి పట్ల తమ ప్రపత్తిని చాటుకుంటారు.అది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మొగిలిచర్ల గ్రామ శివారు ఫకీరుమాన్యం... 1976 సంవత్సరం మే 6వతేదీ రాత్రి. ఆ రోజు వైశాఖ మాసం శుద్ధ సప్తమి. సమయం రాత్రి 11 గంటలు అవుతోంది. శీదత్తాత్రేయ స్వామి ఆశ్రమం భక్తులతో కిక్కిరిసి ఉంది. ఇంతలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. స్వామివారి శరీరంలోంచి ఒక పెద్ద శబ్దం వినబడసాగింది. ఆ ధ్వని దూరం నుంచి ఒక మోటార్‌ సైకిల్‌ వస్తున్న శబ్దంలా ఉంది. రెండు నిమిషాల కాలం గడిచేసరికి ఆ శబ్దనాదం ఉద్ధృతంగా మారింది. అందరూ స్వామివారి వైపు చూశారు. ఆయన నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సుపై భాగానికి పాకిపోయింది. ఇలా దాదాపు ఐదు నిమిషాల పాటు జరిగింది. అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు.
 
ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ మరునిమిషంలోనే స్వామివారి శిరస్సుపై మధ్యభాగం నుంచి రక్తం ధారగా కారింది. అదే సమయానికి ఆశ్రమం బయట ఉన్న వ్యక్తులకు ఆశ్రమం పై భాగం నుంచి ఒక నీలి రంగు జ్యోతి పైకెగసి ఆకాశంలో కలిసిపోవడం కనిపించింది. ఆ జ్యోతిని మొగిలిచర్ల గ్రామంలో ఉన్న వ్యక్తులూ చూశారు. స్వామివారు కపాలమోక్షం పొందారని ఆశ్రమం లోపల ఉన్న భక్తులకు అర్థమైంది. అప్పటి దాకా స్వామివారు తమ ప్రాణాన్ని శరీరంలోని నిలిపి ఉంచారని వారు గ్రహించారు. 1950 ఏప్రిల్‌ 14న అరుణాచలంలో శ్రీరమణమహర్షి శివైక్యం చెందినప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. వారి దేహం నుంచి ఒక మహాజ్యోతి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించడాన్ని ఎందరెందరో తిలకించారు. ఆ తర్వాత మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి జీవితంలో అలాంటి మహత్తర ఘటన ఆవిష్కృతమైంది.
 
ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన పల్లె

మొగిలిచర్ల ఒక పల్లెటూరు. సుమారు 46 సంవత్సరాల కిందట ఒక యోగి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం మొదలుపెట్టేదాకా ఈ ఊరి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ. ఆరు అడుగులకు పైగా పొడుగు, తెల్లని మేని ఛాయ, నెత్తిన ముడివేసుకున్న జటాఝూటం లాంటి జుట్టు, చిరునవ్వు మోముతో ఉన్న 26, 27 ఏళ్ల వయసున్న దిగంబర యువకుడు ఆ ఊరిలో అడుగుపెట్టారు. 32 ఏళ్ల వయసులోనే కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన ఆయన మొగిలిచర్ల దత్తాత్రేయస్వామిగా ప్రసిద్ధి పొందారు.
 
ఇంటి మీద చిలుకలు... ఇంటి చుట్టూ సర్పం

మొగిలిచర్ల గ్రామానికి చేరువలో ఉన్న వలేటివారిపాలెం మండలంలో శ్రీలక్ష్మీ నారసింహుడు స్వయంభువుగా వెలసిన మాలకొండ (మాల్యాద్రి) ఉంది. అక్కడి పార్వతీదేవి ఆలయం స్వామివారి తపోసాధనకు కేంద్రం. ఫకీరుమాన్యం వద్ద ఆశ్రమ నిర్మాణానికి ముందు కొద్దిరోజుల పాటు ఆయన తన భక్తులైన పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి దంపతుల ఇంటిలో ఉన్నారు. ఆయన తపస్సు ఎంత తీవ్రమైనదంటే, దాని శక్తికి పశుపక్ష్యాదులు కూడా ప్రభావితమయ్యేవి. దత్తాత్రేయస్వామి ఆ ఇంటిలో ఉన్నప్పుడు రోజుల తరబడి సమాధి స్థితిలోకి వెళ్లిపోయేవారు. ఆయనకు కేటాయించిన గది తలుపులు మూసివేసుకొని ధ్యానంలో మునిగిపోయేవారు. చిత్రంగా ఆ రోజులలో ఆ ఇంటి మీద వందలాది రామచిలుకలు వచ్చి వాలుతుండేవి. అదే సమయంలో ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరుగుతుండేది. అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించేది. రాత్రిపూట ఒకరకమైన నీలి రంగు కాంతి వలయం ఏర్పడేది. ఈ సంఘటనలన్నిటికీ మొగిలిచర్ల గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు.
 
సమాధి నుంచే భక్తులకు అభయం

శ్రీదత్తాత్రేయస్వామి దేహధారులై ఉన్న రోజుల్లో తనను దర్శించుకోవడానికి ఎందరెందరో భక్తులు సుదూరప్రాంతాల నుంచి వస్తుండేవారు. సత్ప్రవర్తన, నైతిక జీవన ప్రాధాన్యం, క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక విలువల ఆచరణ, మానవత్వ విలువల గురించే బోధిస్తూ వారిలో పరివర్తన తెచ్చేవారు. ప్రజల్లో గూడుకట్టుకున్న మూఢవిశ్వాసాలను తొలగించేవారు. ఆయనకు ఇతోధికంగా సేవలందించినవారిలో శ్రీధరరావు దంపతులు, మీరాశెట్టి దంపతులు, చెక్కా కేశవులు ముఖ్యులు. తన తపస్సు ఫలించిందనీ, దేహాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నాననీ శ్రీదత్తాత్రేయస్వామి వారికి వెల్లడించినప్పుడు... లోకానికి మంచిని బోధించేందుకు మరి కొంతకాలం తమ మధ్య ఉండాలని వారు కోరారు. అయితే, తనను ఆశ్రయించిన భక్తుల మనోరథాలను నెరవేర్చేందుకు, వారికి తగిన బోధ చేసేందుకు, వారిలో పరివర్తన తెచ్చేందుకు శరీరంతో ఉండాల్సిన పనిలేదని, తన సమాధి నుంచే ఆ పని జరుగుతుందని స్వామి చెప్పారు. ఆ ప్రకారమే ఎందరినో అనుగ్రహించినట్లు మొగిలిచర్లకు వచ్చే భక్తులు తమ అనుభవాలను చెబుతూ ఉంటారు.
 
ఇలా ఈ మహిమాన్విత అవధూత సమాధి చెందినప్పుడు వారి బ్రహ్మ రంధ్రము నుండి నీలిరంగు జ్యోతి ఆకారము ఒకటి బయటికి వచ్చి ఆకాశములో లీనమైనట్లుగా చాలా భక్తులు దీనిని చూసినట్లుగా చెప్పడం జరిగినది. కానీ షిరిడి సాయిబాబా అలాగే రామకృష్ణ పరమహంస జీవ సమాధి చెందినపుడు వారి బ్రహ్మ రంధ్రము వద్ద ఇలాంటి జ్యోతి దర్శనం కలగటం వారి భక్తులు ఎవరు కూడా చూడలేదు. మరో ప్రక్క శ్రీ రాఘవేంద్ర మఠాధిపతులు ఎవరైనా జీవసమాధి చెందితే వారి బ్రహ్మరంధ్రము నుండి తెల్లని పదార్థం బయటికి రావటం సర్వసాధారణంగా జరుగుతుంది. అదే అరవింద యోగి విషయంలో అయితే తన బ్రహ్మరంధ్రము నుండి రక్తము బయటికి విరజిమ్మినట్లుగా అనుభవ అనుభూతిని పొందడం జరిగినది.ఈ విషయము వారు రచించిన సావిత్రి అనే మంత్ర శాస్త్ర గ్రంధం లో చెప్పడం జరిగినది. అలాగే అరుణాచల రమణ మహర్షి ప్రధాన శిష్యుడైన కావ్యకంఠ మహాముని వారు బ్రతికి ఉండగానే బ్రహ్మరంధ్రము నుండి నిరంతరముగా ఒక చితాగ్ని జ్యోతి ప్రజ్వలనం వస్తూ ఉండేది. తర్వాత దీనిని తన యోగ ప్రక్రియ విధానాల ద్వారా ఆపుకోవడం జరిగినది. అంటే కపాలమోక్షం విధానములో ఇన్ని విధానాలు ఉంటాయా లేదా నిజానికి ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవాలని నాలో తీవ్రమైన ఆకాంక్ష మొదలైంది. 

అప్పుడు నా పరిశోధనలలో తేలిన విషయం ఏమిటంటే కపాలమోక్షం స్థితి అనేది  మన పంచ శరీరాలు అనగా స్థూల- సూక్ష్మ- కారణ- సంకల్ప- ఆకాశ శరీరాలు పంచ కపాలమోక్షం స్థితులు ఉంటాయని… ఇందులో ప్రతి శరీరములో ఏడు కపాలాలు చొప్పున ఐదు శరీరాలకి కలిపి 35 కపాలాలు (5x7=35)ఉంటాయని ఇందులో ఒక సాధన కపాలము ఉండుట చేత మొత్తం  కలిపి 36 కపాలాలతో ఉన్న మూల ఏక కపాలము ఉంటుందని ఇలా ఉన్న పంచ శరీరక కపాలములకి పంచ కపాలమోక్షం స్థితిని కలిగిస్తే అనగా మూల ఏక కపాలమోక్షం స్థితి అనగా నిశ్చల స్థితిని ఈ 36 కపాలములకి కలిగిస్తే అదియే సంపూర్ణ కపాలమోక్షం అవుతుందని మేము తెలుసుకోవడం జరిగినది. కానీ ప్రస్తుతానికి 34 కపాలాలు మాత్రమే కపాల మోక్షం స్థితిని పొంది 35వ కపాలము జ్ఞాన కపాలముగా 36 కపాలము ప్రాణశక్తి కపాలముగా మిగిలి పోవటంతో ఇంత వరకు ఎవరూ కూడా సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందలేదని అనగా ఆకాశ శరీర కపాలమోక్షం స్థితిని పూర్ణముగా ఎవరూ కూడా పూర్తి చేయలేదని మేము తెలుసుకోవటం జరిగింది. 

మరొక రోజు మాకు మరో చిన్న సందేహము వచ్చినది. అది ఏమిటంటే కపాలమోక్షం విధి విధానాలలో ఎందుకు వివిధరకాలుగా మోక్షము జరుగుతోంది అనగా రక్తము, వీర్యము, అగ్ని వంటి రకాలుగా కపాలము మీద ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు కపాలము అనేది సప్త ధాతువులతో ఏర్పడుతుంది. అనగా రసము, రక్తము, మాంసము, ఎముక, క్రొవ్వు, మజ్జ, వీర్యము అనే సప్త ధాతువులతో ఏర్పడుతుంది. దహనము అంతిమ స్థితి వచ్చేసరికి కపాలంలో వీర్యము లేదా రక్తము మిగిలి పోతుంది.  దీనికి కారణం తమలో ఇష్ట కోరిక ఉన్న వారికి వీర్యముగాను,తమ కోరిక తీర్చుకున్న వారికి రక్తముగాను మిగిలిపోతుంది. ఎందుకంటే వీర్యము నుండి తిరిగి రక్తముగా మారుతుందని శాస్త్ర వచనము. అదే ఇష్ట కోరిక మాయను దాటిన వారికి చితాగ్ని మిగిలిపోతుంది. ఈ లెక్కన చూస్తే భక్తుల బాధలు తీర్చాలనే తపనే రాఘవేంద్ర మఠాధిపతులు కి ఒక కోరిక గా మారటం వలన కపాలమోక్షం సమయానికి కపాలము నుండి వీర్యము బయటికి వస్తూ ఉండాలి. అదే అరవింద యోగి లాంటి వారికి అయితే తమ ఇష్ట కోరికలు తీరటం జరుగుతూ ఉండాలి. వీరి ప్రకారము అయితే శ్రీకృష్ణుడు మాయ నుండి తప్పించుకోవటానికి సాధకుడికి మహా నిర్వాణ శక్తి గావాలి అని తెలుసుకోవడమే వారి ఇష్ట కోరిక అయిన శ్రీ కృష్ణ మాయ తప్పించుకోవడం ఎలా అనేది తీరటం వలన వీరి కపాలము నుండి రక్తం బయటికి వచ్చి ఉండాలి. ఇక కావ్యకంఠ మహాముని విషయానికి వస్తే ఇలాంటి యోగులకి సమస్త కోరికలు దాటటం జరిగి చివరికి మోక్షం పొందాలనే కోరికను కూడా దాటటం జరగటంతో కపాలములో ఉన్న వీర్యము కాస్త రక్తముగాను, ఈ రక్తము కాస్త అధిక వేడిని పొంది చితాగ్నిగా మారిపోయి ఉండాలి. ఇదంతా నా ఊహే. నా విశ్లేషణ. నా స్పురణే. వీటి విశ్లేషణ బట్టి వారికున్న కోరిక స్థాయిలను బట్టి వారి కపాలమోక్షం విధానాలలో తేడా ఉండవచ్చునని మాకు అర్థం అయినది.
 
27 సంవత్సరాల మా యోగసాధన ద్వారా మేము పొందిన అనుభవం ద్వారా తెలుసుకున్న ఒక సత్య జ్ఞానం ఏమిటంటే నువ్వు దేని గురించి ఆలోచించకుండా నువ్వు దేనికి స్పందించకుండా నువ్వు దేనిని సంకల్పించకుండా పరిపూర్ణ జ్ఞానముతో నీ గత లేదా భవిష్య ధ్యాన అనుభవ దృశాలను సంపూర్ణముగా నిశ్చల స్థితిలో 96 నిమిషాలపాటు చూస్తూ ఉండగలిగితే అదియే యోగ సాధన పరిసమాప్తి స్థితి అని నేను ఆత్మ అని తెలుసుకోవడం జ్ఞానప్రాప్తి అయితే నేను ఆత్మ అనే జ్ఞానస్పురణ లేకుండా ఉండుటయే మహా మృత్యువు అగు మూల కపాలమోక్షం ప్రాప్తి అని మేము గ్రహించిన సత్య జ్ఞానము. అలాగే నిరాకార పరబ్రహ్మ గా పరమ శూన్యము ఉంటుందని ఆకార పరబ్రహ్మముగా మూల కపాలము ఉంటుందని సాకార పరబ్రహ్మముగా చితాగ్ని జ్యోతి ఉంటుందని మేము గ్రహించిన అనుభవ అనుభూతి నిత్య సత్యము. 

2018 వ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి అర్ధరాత్రి సమయంలో అనగా నిండు పౌర్ణమి ఘడియలలో మాకు ఒక దివ్యమైన ప్రత్యక్ష అనుభవం అయినది. అది ఏమిటంటే ఆకాశమునుండి ఒక దివ్య జ్యోతి బయలుదేరి మేము నిత్యం ధరించే  ఇష్టలింగమునందు అది ప్రవేశించినది. అప్పుడు మా ఎడమచేతిని ఈ లింగం మీద ఉంచగానే ఆపై అది కాస్త ఎడమ చేతి ద్వారా హృదయమునందు ప్రవేశించి అటుపై బ్రహ్మ నాడి ద్వారా బ్రహ్మరంధ్రము వద్దకు చేరుకుని అతి చిన్న అంగుళ మూల కపాలముపై చితాగ్ని రూపముతో అనగా మా మాడు పైభాగములో దివ్య జ్యోతిగా  కపాల అగ్నిగా వెలుగుతున్న ట్లుగా ప్రత్యక్ష అనుభవం అయినది. ఎప్పుడైతే మా ప్రారబ్ధ కర్మలు సంపూర్తిగా కర్మ శేషము లేకుండా నాశనము అవుతాయో ఆనాడే ఈ చితాగ్ని మమ్మల్ని దహనం చేస్తుందని ఇదియే యోగాగ్ని అని ఇది కాస్త ప్రారబ్ద కర్మ నివారణ కోసం ఎదురు చూస్తోందని నాకు అర్థమైనది. దానితో దీప దుర్గగా మహామృత్యువు దేవత మాకు కపాలమోక్షం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నదని మాకు అర్థం అయినది. మా 53 ఏటా మహా స్మశానం క్షేత్రమైన కాశీ క్షేత్రము నందు పంచగంగా ఘాట్ నందు మా సద్గురువైన నడయాడే కాశీ విశ్వనాథుడు అయినా శ్రీ త్రైలింగ స్వామి మఠ పరిసరాల దగ్గర 33వ కపాలమోక్షం జరిగి ఆపై నిత్య చితాగ్ని స్వరూపం అయిన మణికర్ణికా ఘాట్ యందు ఈ దేహ జన్మను దహనాగ్ని రూపంలో దీప దుర్గ నాశనం చేస్తుందని ఆపై మేము కాస్త నిశ్చల స్థితిలో ధ్రువతారగా విశ్వ శూన్యములో ఉండిపోతామని మాకు స్పురణ అయినది. అలాగే మా శ్రీమతి దీక్షా దేవి కూడా తన 52 వ యేట నిత్య సౌభాగ్యవతిగా ఇదే విధముగా శివైక్యం చెంది సహస్ర చక్ర స్థితిలో కలిగే శరస్థి ముక్తిని(ఈమె సహస్ర చక్రము దాటలేదు గదా) పొంది కారణ శరీరముతో హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతము నందు చేరి అక్కడ ఉన్న సదాశివమూర్తిని నిత్య ఆరాధనతో ఉండి పోతారని మాకు జ్ఞాన స్పురణ అయినది. మేము ఆకాశమునందు ధ్రువ తార గా మిగిలిపోతే వీరు కాస్త కారణ శరీరంతో సదాశివమూర్తి ని ఆరాధన చేస్తారని ఇలా పది లక్షల సంవత్సరాలు చేసి ఆపై మాతో సంబంధము లేని మరో యోగ జన్మ ఎత్తి సహస్ర చక్ర యోగ మాయను దాటి  ఇష్టలింగారాధనమైన హృదయ చక్ర ఆరాధనకు వస్తారని తెలిసినది. మేము పొందిన అనుభవ అనుభూతి వలన మా జీవాత్మ కాస్తా శివ ఆత్మగా మారి మౌన బ్రహ్మగా నీలి ఆకాశం కేసి చూస్తూ అక్కడ నా కోసం చూస్తున్న నీలిరంగు చితాగ్ని స్వరూపమైన దీప దుర్గ యొక్క దీపజ్యోతిని తలుస్తూ చూస్తూ ఉంటుంది.
 
మీకు తెలుసు కదా. అదేనండీ మాకు  2018 నవంబర్లో అనగా కార్తీక మాసములో కార్తీక పౌర్ణమి నాడు ఆకాశమునుండి జ్యోతి మా ఇష్టలింగము నందు ప్రవేశించి ఎడమ చేతి ద్వారా మా హృదయ చక్రమునకు చేరుకుని అటుపై బ్రహ్మ రంధ్రము వద్ద అగ్ని జ్యోతిగా నిలబడి పోయినదని మీకు ఇంతకుముందు తెలియజేయడం జరిగినది కదా. గుర్తుకు వచ్చిందా. వచ్చే ఉంటుంది లెండి. లేకపోతే వెనక్కి వెళ్లి చదివి గుర్తుకు తెచ్చుకోండి. ఎప్పుడైతే ఈ జ్యోతి మాలోనికి ప్రవేశించినదో ఆనాటినుండి మాలో కొత్త లక్షణాలు వెలుగు చూడటం జరిగినది. సరిగ్గా నిద్ర ఉండదు. ఆకలి ఉండదు. ఏమీ తినాలని అనిపించదు. ఏమీ కావాలని అనిపించదు. ఏమీ చేయ బుద్ది అవ్వదు. ఏమి చూడ బుద్ధి అవ్వదు. ఏదో చెయ్యాలని ఏదో తెలుసుకోవాలనే తపన లేదు. భయము లేదు. తాపత్రయం లేదు. భయము లేదు. వేటి యందు ఆసక్తి లేదు. చివరికి సంసార సుఖము నందు కూడా ఆసక్తి దొబ్బినది. కేవలం విశ్రాంతిగా పడుకోవాలని విశ్రాంతి ఆలోచన చేయాలనే ఆలోచన మాత్రమే ఉండేది. అనగా నిద్ర అలాగే మెలుకువ కుంటే యోగ నిద్ర పోవాలని వచ్చిన ఆలోచన అన్నమాట. కాకపోతే ప్రతి చిన్నదానికి విపరీతమైన కోపం ఆవేశాలు అకారణంగా వస్తూ ఉండేవి. అలాగే కారణము లేకుండా నవ్వు వచ్చేది ప్రతి చిన్న విషయానికి. అతిగా స్పందించటం అతిగా కోపానికి గురి కావటం జరుగుతూ ఉండేది. పైగా అన్నిటి యందు సహన శక్తిని కోల్పోవడం జరుగుతూ ఉండేది. అబద్ధపు మాటలు విన్న, అబద్ధపు పనులు చేసే వారిని చూసిన, చెడు బుద్ధి ఉన్న వారిని చూసిన, చెడు ఆలోచనలు ఉన్నవారు కనపడిన, చెడు పనులు చేసే వారిని చూసిన నాకు వీరావేశం కలిగి నా ప్రమేయం లేకుండా నాకు సంబంధము లేకుండా వారిని విపరీతముగా ఆవేశములో ఏదో విధముగా తిట్టడం చేస్తూ ఉండటం నేను గమనించిన విషయాలు అన్నమాట. ఇది ఈ ఆకాశనీలం జ్యోతి నా లోనికి ప్రవేశించి నప్పుడు అలాగే ఇష్టలింగము ధరించినప్పుడు ఈ పరిణామాలు జరుగుతున్నాయని గ్రహించాను. ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలిసేది కాదు. దానితో అందరూ కూడా గౌరవంతో కూడిన భయముతో నా దగ్గర ఉండే వాళ్లు. అలాగే నాతో మెలగడం చేస్తున్నారని గ్రహించాను. కాని నేను ఏమి చేయగలను. ఇదంతా నా ఆధీనములో ఉంటే నన్ను నేను ఉంచుకొనేవాడిని.అలా లేదు. ఈ విధముగా నిజ అఘోరాలు, నిజ  కాపాలికులు, నిజ నాగ సాధువులు, నిజ భైరవులు, నిజ అవధూతలు, నిజ పరమహంసలు, నిజ పరమ గురువులు, నిజ పరమ యోగులు చేస్తూ ఉంటారని ఇదియే నిజ శూన్య బ్రహ్మ లక్షణాలని శ్రీ లాహిరి మహాశయులు చెప్పిన అనుభవ సత్యాలు పుస్తకములు చదవటం వలన ద్వారా మేము తెలుసుకోవడం జరిగినది. ఇదిలా ఉండగా ఒక రోజు మాకు బుద్ధుడు చెప్పిన ఒక సామెత నా ఫోన్ కి ఒక ఎస్ఎంఎస్ ద్వారా వచ్చినది. అది ఏమిటంటే మన మెదడు ఒక అయస్కాంతం లాంటిదని దానికి మనము ఎప్పుడూ మంచి ఆలోచన ఇస్తే అది మరింతగా మంచి ఆలోచనలు ఆకర్షణ చేస్తుందని అదే మనము ఎప్పుడూ సమస్యల గురించి ఆలోచన చేస్తే అది మరింతగా సమస్యలను ఆకర్షణ చేస్తుందని మన ఆలోచన బట్టియే మన మెదడు ఉంటుందని మన మనస్సు ఉంటుందని మన శరీర స్థితి ఉంటుందని మేము గ్రహించి నెమ్మది నెమ్మదిగా దేనికి అతిగా స్పందించకుండా దేనిగురించి అతిగా ఆలోచనలు చేయకుండా అన్నిటిని సాక్షీభూతంగా మౌనముగా చూడటం అలవాటు చేసుకున్నాము.అభ్యాసం చేయటం ఆరంభించాము.

మనకి కపాలమోక్షం స్థితి కలగాలంటే కనిపించవలసిన లక్షణాలు:

నిజానికి మనకి కపాలమోక్షం స్థితి కలగాలంటే మన మధ్య మాడు భాగము అనగా బ్రహ్మరంధ్రము ప్రాంతంలో వుండే మాడు భాగము ఒక అంగుళం మేర చాలా మెత్త పడాలి. 

అనగా ఆరు నెలల పసి పిల్లవాడి మాడు ప్రాంతమును మధ్య భాగములో మీరు ఎప్పుడైనా చూస్తే వాడికి అంగుళం మేర చిన్న గుంటగా మెత్తగా సున్నితముగా ఎలా ఉంటుందో అలా సాధకుడికి సాధన పరిసమాప్తి సమయములో అలాగే మధ్య మాడు ప్రాంతము మెత్తగా సున్నితముగా తయారు అవ్వాలి. 

అప్పుడే కపాల మోక్షం స్థితికి అర్హత లభించినట్లు అవుతుంది. ఈ స్థితికి వచ్చేసరికి నిజ  సాధకుడు పసి పిల్లవాడి మనస్తత్వము కలిగి ఉంటాడని గ్రహించండి.

అలాగే అప్పటిదాకా ఉన్న మాయ, అజ్ఞాన, మోహాల, వ్యామోహం వలన మూసుకుని పోయిన బ్రహ్మరంధ్రము ఇలా మెత్తబడి తెరుచుకోవడం చేస్తుందని తెలుసుకోండి. 

మా సాధన పరిసమాప్తి సమయంలో ఇలాంటి లక్షణాలు మాడు ప్రాంతమునందు జరగటం వలన వీటిని ఇంత వివరంగా వ్రాయటం జరుగుతోందని గ్రహించండి. ఈ లక్షణాలు కలిగి ఉండటం నిజమేనని తెలుసుకోండి. 

అలాగే ధ్యానము నందు 85 సంవత్సరాల  వయస్సు ఉన్న ఒక వృద్ధ ముదుసలి తెల్లని జుట్టు తో నల్లని చీరతో గద్ద ముక్కు తో వంకర తిరిగిన గోర్లతో విరబోసిన తెల్లని జుట్టుతో బాగా ముడతలు పడిన శరీరముతో అచ్చంగా విఠలాచార్య సినిమాలో కనిపించే వృద్ధ మాంత్రికురాలిగా ఈమె కనిపించాలి అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అలంపురం జోగులాంబ ఎలా అయితే వృద్ధ మాంత్రికురాలుగా కనపడుతుందో అలాగే ఈ వికృత భయంకర రూపముతో మనకి 85 సంవత్సరాల వృద్ధ స్త్రీ మూర్తి దర్శనం ఇస్తుంది. ఈమెయే మహా మృత్యువు మనకి ప్రసాదిస్తుంది. ఈమె వాహనము స్థూల శరీరము అని గ్రహించండి. మానవ శరీరమే ఈమె వాహనము అన్నమాట. ఇలా ఈ శరీర వాహనము తో ఆవిడ సంచారము చేస్తున్నట్లుగా భయంకరమైన గ్రద్ద గొంతుతో అనగా కీచు గొంతుతో వివిధ రకాల శబ్దాలు చేస్తూ ఉంటుందని గ్రహించండి. ఇలాంటి స్త్రీ మూర్తి కూడా మనకి ధ్యానములో కనపడితే మనకి పంచ శరీర కపాలమోక్షం స్థితికి అర్హత లభించినట్లే అవుతుంది. ఇలాంటి స్త్రీ మూర్తి దర్శనం ఇవ్వటం వలన ఆనాడు ఈమె ఇలా ఎందుకు దర్శనమిచ్చినదో తెలియకపోయినా ఈనాడు ఆ సాధన పరిసమాప్తి కావటంతో ఈ స్త్రీమూర్తి గూర్చిన వివరాలు ఇంత వివరంగా చెప్పడం జరుగుతోందని గ్రహించండి. అంటే మాడు మధ్యభాగము అనగా బ్రహ్మరంధ్రం ప్రాంతము మెత్తబడితే మనకి కపాలమోక్షం స్థితికి అర్హత లభించినట్లే. అటుపై ఈ 85 సంవత్సరాల వికృత భయంకర స్త్రీ మూర్తి దర్శన ప్రాప్తి కలిగితే మనకి పంచ శరీరాల కపాల మోక్షప్రాప్తి అర్హత లభించినట్లయిందని. తెలుసుకోండి. ఇలాంటి స్త్రీ మూర్తి దర్శనం నిజముగా నే కలుగుతుందని మాకు హిమాలయ గురువులైన కళ్యాణ్ దాస్ యోగి  అనుభవం ద్వారా తెలుసుకోవడం జరిగినది. అనగా వారికి మహా మృత్యువు చూడాలని ఈయనికి కోరిక కలిగినది. దాంతో ఆయన కఠోర అగ్ని సాధన చేయటం, ఆవిడ తనకి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి నేను పిలుస్తున్న నీవు రావడంలేదని పలుమార్లు చెప్పడం జరిగినది. కానీ ఈయనకు అర్థం కాక ఎక్కడికి రావాలి?ఎందుకు రావాలి? అసలు ఈవిడ ఎవరు?  అని మూడుసార్లు ప్రశ్నించేసరికి ఆమె మాయం అయినది. దాంతో ఈయన ఆమె ఎవరో తెలుసుకోవాలని చండి స్తోత్రం చేయగానే తాను ఎవరి కోసం మహా మృత్యువు అనుభూతి పొందాలని తపన పడినాడో వారే ఈమె అని తెలుసుకొని మౌనం వహించారు. ఒకవేళ ఈయన ఆమెను ప్రశ్నించకుండా ఆమె చెప్పినట్లుగా పిలుస్తోంది కదా అని వెళ్లి ఉంటే ఈ యోగ సాధన ఎప్పుడో పరిపూర్ణంగా సంపూర్ణంగా పరిసమాప్తి అయ్యేది. మోక్ష ప్రాప్తి పొందడం జరిగేది. కాని వీరు ప్రశ్నించడంతో తిరిగి తన హృదయ చక్రం లోకి తన యోగసాధన స్థాయి వచ్చిందని,  మళ్లీ మోక్ష ప్రాప్తి పొందాల్సిన తను మోక్షఆత్మగా మిగిలిపోయినానని  తెలుసుకున్న ఆయన ఏ మాత్రం చలించలేదు. చింతించలేదు. పట్టించుకోలేదు. అన్ని రకాల అవాంతరాలు దాటిన పరిపూర్ణ అవధూతగా మిగిలిపోయారు.

బ్రహ్మాండ చక్ర కృష్ణ బిల్వం

ఇక మనకి కపాలమోక్షం స్థితి ప్రారంభమైనదని గుర్తుగా మన మధ్య మాడు ప్రాంతంలో అనగా బ్రహ్మరంధ్రం ప్రాంతంలో ఒక వెలుగుతూ తిరుగుతున్న భూచక్రము దర్శనమిస్తుంది. ఇది కూడా దీపావళికి వెలిగించే భూచక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. నిజానికి దీపావళి భూచక్రము వెలుగులను బయటికి విరజిమ్ముతూ ఉంటే మన బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న భూ చక్రము ఒక జ్యోతి లాగా ఉండి గుండ్రంగా తిరుగుతూ తన చుట్టూ ఉన్న రేణువు లాంటి కాంతి శరీర రేణువులను తనలో ఇముడ్చుకున్న ట్లుగా మనకి దర్శనమిస్తుంది. అనగా అచ్చముగ బ్లాక్ హోల్ యానిమేషన్ లాగా అన్నమాట. వీటిని చూసే మన పూర్విక మహర్షులు బ్రహ్మ చక్రము లేదా బ్రహ్మాండ చక్రము లేదా సుదర్శన చక్రము లేదా కృష్ణ చక్రము అని పిలవడం జరిగింది అని మాకు అర్థమయింది. వేదాంతులు దీనిని బ్రహ్మ చక్రం అని పిలిస్తే మన శాస్త్రవేత్తలు దీనిని కృష్ణ బిల్వం లేదా బ్లాక్ హోల్ అన్నారు. అంటే ఈ కృష్ణబిలాలు మీకు దర్శనం అయితే మీలో ఉన్న కర్మలు సంపూర్తిగా అనగా అనగా కర్మ శేషము లేకుండా కర్మ క్షయం అవుతుంది అని గ్రహించండి.ఇక దానితో కర్మ జన్మ స్పందన రహిత్యమును పొందడం జరుగుతుందని గ్రహించండి. కాకపోతే ఈ బ్రహ్మాండ చక్రం యొక్క చితాగ్ని దహన శక్తిని సాధకుడు తట్టుకోవాలి. వారు తట్టుకునే స్థితిని బట్టి మన పంచ శరీర కపాలమోక్షం స్థితి ఆధారపడి ఉంటాయని గ్రహించండి. అనగా 96 నిమిషాలపాటు అనగా ఒక మన్వంతర కాలము అంటే 30,67,2000 కోట్ల సంవత్సరాలు అనగా బ్రహ్మాండ చక్ర దహన శక్తి అప్పటికీ 10లక్షల శక్తికి చేరుకోవటంతో సాధకుడు సహన శక్తిని కోల్పోవడంతో ఆపై ఆకాశ శరీర కపాలమోక్షం స్థితిని పొందలేక కేవలం స్థూల సూక్ష్మ కారణ సంకల్పం కపాల మోక్షం స్థితిని పొందడం జరుగుతోందని మాకు అర్థమయింది. 

ఇక బ్రహ్మరంధ్రము వద్ద తిరిగే శ్రీ బ్రహ్మాండ చక్రం యొక్క చితాగ్నియొక్క దహనశక్తి వివరాలు మేము తెలుసుకోవడం జరిగినది. దీనికి చండీమాత అధిదేవతగా ఉంటుంది. అలాగే చండీ హోమమునకు ఎంతటి శక్తి ఉంటుందో మన బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్రము దహనశక్తికి అంతటి శక్తి ఉంటుందని వివిధ యోగులు అనుభవాల ద్వారా మేము తెలుసుకోవటం జరిగింది. ప్రారంభములో దీని దహన శక్తి నవాంశ శక్తి అయితే అటుపై శతాం శక్తి అటుపై సహస్ర శక్తి అటుపై పదివేల శక్తి అనగా ఆయత ఆపై నియతశక్తి అనగా లక్ష ఆపై ప్రయత శక్తి అనగా  పది లక్షల శక్తి దాకా పెరుగుతూ ఉంటుందని తెలిసినది. అనగా 21 రోజులతో మొదలై 30672000 కోట్ల సంవత్సరాలు అనగా తొంబై ఆరు నిమిషాల పాటు ఈ దహన శక్తి ఉంటుందని గ్రహించండి. సాధారణముగా మన స్థూల శరీరము ఈ దహన శక్తికి నవాంశ శక్తి కి వచ్చేసరికి తట్టుకోలేక నాశనమవుతుందని స్వయంగా రామకృష్ణ పరమహంస చెప్పియున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి స్థూల శరీరము కపాలమోక్షం స్థితి పొందాలి అంటే ఈ బ్రహ్మరంధ్రము బ్రహ్మాండ చక్రం చితాగ్ని దహన శక్తిని నవాంశశక్తి దాకా తట్టుకోవాలి. అప్పుడే మన స్థూల శరీరానికి కపాలమోక్షం స్థితి కలుగుతుంది. అటుపై శతాం శక్తిని తట్టుకోగలిగితే మన సూక్ష్మ శరీరానికి కపాలమోక్షం స్థితి అటుపై సహస్ర శక్తిని తట్టుకోగలిగితే మన కారణ శరీరానికి కపాలమోక్షం అటుపై ఆయుత శక్తిని తట్టుకోగలిగితే మన సంకల్ప శరీరానికి విముక్తి కలుగుతుంది. ఇక అటు పై ఆయుత శక్తి నుండి ప్రయతశక్తి మధ్య ఉన్న దహన శక్తిని తట్టుకోగలిగితే మన రేణువు వంటి ఆకాశ శరీరానికి విముక్తి కలిగి సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందటం జరుగుతుంది. లేదంటే స్వప్న శరీరముగా మిగిలి పోవడం జరుగుతుంది. అనగా పరమ శూన్యము యొక్క స్వప్నములో మనము ఏదో ఒక పాత్ర వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆదియోగి అయిన పరమేశ్వరుడు అనగా సదాశివుడు ఒకరు మాత్రమే ఆయుత అలాగే ప్రయతశక్తి  మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అనగా లక్షల శక్తి నుండి పది లక్షల దహనశక్తి దాకా వెళ్ళటానికి స్వప్న శరీరముతో స్వప్న సాధన చేస్తున్నాడు. మనము అలాగే మన దైవాలు కూడా మరియు మన పరమాత్మలు కూడా ఈ దహనశక్తిని తట్టుకోవటానికి స్వప్న శరీరాలతో స్వప్న సాధన చేసే స్వప్న సాధకులమని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. 

అలాగే స్థూల శరీరానికి కపాల మోక్షం విముక్తి కలిగితే మన బ్రహ్మరంధ్రము నుండి రక్తము లేదా రక్త చారిక బయటకు వస్తుంది. అదే సూక్ష్మ శరీరానికి కపాల మోక్షం కలిగితే మన బ్రహ్మరంధ్రము నుండి తెల్లని పదార్థం అయిన వీర్యం బయటకు వస్తుంది. అదే కారణ శరీరానికి కపాలమోక్షం కలిగితే నిరంతరం మన కపాలము నుండి నిరంతరముగా ఒక జ్వాలాగ్ని(31/2 సం!!లు అనగా 1000 రోజులు) బయటకు వస్తుంది. అదే సంకల్ప శరీరానికి కపాల మోక్షం కలిగితే నీలిరంగు జ్యోతి బయటికి మన కపాలము యొక్క బ్రహ్మరంధ్రము నుండి బయటకు వస్తుంది. అదే ఆకాశ శరీరానికి కపాలమోక్షం కలిగితే అన్ని శరీరాలను తన చితాగ్ని దహించి వేస్తూనే ఉంటుంది. అనగా లక్ష శక్తి నుండి మొదలై 10 లక్షల శక్తితో దహించివేస్తుంది. ఈ సమయములో ఈ దహన శక్తిని ఎవరైతే లిప్త కాలంపాటు అనగా ఒక సెకనులో వెయ్యో వంతు ఒక క్షణికము లో వందో వంతు కనురెప్ప తెరిచే మూసే  కాలములో మన శ్వాస తీసుకునే సమయంలో కూడా సహన శక్తిని కోల్పోకుండా ఉండాలి.ఇలా సహనశక్తి కోల్పోకుండా ఎవరైతే ఉండగలుగుతారో వారికి మాత్రమే ఆకాశ శరీర కపాలమోక్షం స్థితిని పొందడం జరుగుతుంది. 

 
ఒకవేళ ఈ పంచ శరీర కపాలమోక్షం స్థితిలో 1, 3, 5, 7, 9, 11 కపాల మోక్షం విధాన పద్ధతుల్లో మన 36 కపాలాలు విభేదనము అవుతాయి. ఎవరికైతే ఆకాశ శరీర కపాల స్థితి కలిగితే ఒకటో స్థితి… అదే సంకల్ప కపాల స్థితి కలిగితే మూడవ స్థితి …అదే కారణ శరీరం కపాల స్థితి కలిగితే ఐదవ స్థితి… అదే శరీరానికి సూక్ష్మ కపాలమోక్షం స్థితి కలిగితే ఏడో స్థితి…. అదే స్థూల శరీర కపాలమోక్షం స్థితి కలిగితే తొమ్మిదవ స్థితి కలుగుతుంది. ఒకవేళ వీటిలో ఏ శరీర కపాలమోక్షం స్థితి  పొందలేకపోయిన వారికి 11 అంశాలతో కూడిన స్వప్న శరీరము అనగా 11 స్థితి అనగా ఏకాదశరుద్రులుగా మిగిలిపోవడం జరుగుతుందని మేము గ్రహించడం జరిగింది. దానితో సాధకుడు తన స్వప్న శరీరముతో 11 కపాలముతో తన సాధనను కొనసాగిస్తూ తొమ్మిదవ కపాలమోక్షం స్థితి నుండి ఏక కపాల స్థితికి చేరుకోవాలి అన్నమాట. అనగా స్థూల శరీర కపాల స్థితి తో మొదలై ఆకాశ శరీరక పాల స్థితికి చేరుకోవాలి. లేదంటే 11 కపాలముతో స్వప్న శరీరం పొందడం జరుగుతుంది. అనగా రూపం అంతము కావాల్సిన చోట రూపాంతరం చెందుతారు అన్నమాట. ఇలా రూపాంతరం చెందిన వారు ఆకాశ కపాలమోక్షం స్థితి యందు విఫలం చెందిన యోగులు అని గ్రహించండి. అలాగే స్థూల శరీర కపాల స్థితిని నాకు తెలిసి అరవింద యోగి అలాగే సూక్ష్మ కపాలమోక్షం స్థితిని రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు అలాగే కారణ శరీర కపాల మోక్షం స్థితిని అరుణాచల రమణ మహర్షి శిష్యుడైన కావ్యకంఠ గణపతి మహాముని పొందటం జరిగితే ఇంకా సంకల్ప శరీర కపాలమోక్షం స్థితిని అరుణాచల రమణ మహర్షి అలాగే మహిమాన్విత అవధూత పొందటం జరిగితే ఆకాశ క కపాలమోక్షం స్థితికి ప్రయత్నం చేస్తున్న వారిలో శుక మహర్షి అలాగే సదాశివమూర్తి ఉన్నారని తెలిసింది. ఇప్పటికి శుక మహర్షి యొక్క శరీరము అగ్నిలో దహింప పడుతున్నట్లుగా వివిధ హిమాలయ యోగులు  గురువులు తమ ధ్యాన నిజరూప దర్శన అనుభవాలు పొందడం జరిగింది. 

కాకపోతే సహన శక్తి 9 లక్షల స్థితికి వచ్చేసరికి తట్టుకోలేక తన గురించి ఆలోచన చేసే వారి దగ్గరికి స్వప్న శరీరముతో అనగా చిలక రూపముతో వెళ్ళి ఆవు పాలు పితికి తీసే సమయం అంత సమయం వారితో గడిపి వారికున్న జ్ఞాన ధర్మ సందేహాలు తీర్చి మళ్లీ కపాలమోక్షం సాధనకై వెళ్ళిపోతూ ఉంటారని వివిధ శాస్త్రాల ద్వారా యోగుల అనుభవాల ద్వారా తెలుసుకోవడం జరిగినది. అందుకే మనకు వివిధ కపాలమోక్షం స్థితి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో వాటికున్న కారణాలు ఏమిటో ఈ విధంగా తెలుసుకోవడం జరిగినది. అలాగే ప్రస్తుత సాధన జన్మ యొక్క సాధన స్థితిని బట్టి మీకున్న ఆలోచనా స్థాయిని బట్టి ఏకకాలంలో పంచ శరీర కపాలమోక్షం స్థితిని పొందవచ్చును. అంటే ఈ జన్మలో ఒక శరీర కపాలమోక్షం స్థితిని పొందవచ్చు అని తెలుసుకోండి. మరుజన్మలో యోగి గా మారి మిగిలిన శరీరాల కపాల మోక్ష సాధనకు ముక్తి రూపములో సాధన జన్మలు ఉంటాయని గ్రహించండి.ఒకవేళ సాధకుడు ఈ పంచ శరీర కపాల మోక్ష స్థితిలో ఏ శరీర కపాల మోక్షమును పొందిన ఆయా స్వప్న శరీరమును పొంది ఆత్మ శాంతితో ఈ జీవ నాటకమునందు ముక్తిని పొంది ఆటలో అరటి పండు లాగా మారి జరిగే జీవ నాటకము సాక్షీభూతంగా చూస్తూ మౌనం వహిస్తాడు. ఎప్పుడైతే తన సహన శక్తిని కోల్పోతాడో అనగా మనోనిశ్చల స్థితి కోల్పోతాడో వెనువెంటనే ఏ శరీర స్థితి దగ్గర ఆలోచనా స్థితిని పొందుతాడో అదే శరీరమును పొంది అటుపై సాధనం చేయడం చేస్తారని మా మనో దృష్టికి వచ్చింది. అంటే మన ఆలోచనయే మహామాయ అన్నమాట. ఎవరైతే ఆలోచనా రహిత స్థితి అనగా ఆనంద రహిత స్థితిని పొందుతారో వారే ఆకాశ శరీర కపాలమోక్షం స్థితిని పొందే సంపూర్ణ కపాలమోక్షగామి అవుతారని గ్రహించండి. ఆలోచనయే శ్వాసగా… శ్వాసయే సంకల్పముగా… సంకల్పమే స్పందనగా… స్పందనయే భయముగా… భయమే ఆశగా మారి మన పంచ శరీరాలు అయిన స్థూల- సూక్ష్మ- కారణ- సంకల్పం- ఆకాశ శరీరాలకి వరుసగా ఆశ, భయం, స్పందన, సంకల్ప, ఆలోచన మహా మాయలు గా నిలిచి పంచ కపాలమోక్షం స్థితికి అడ్డంగా నిలుస్తాయని అవగతమైనది. అనగా స్థూల శరీరధారులు అంటే భూలోక జీవాత్మ వాసులుగాను, సూక్ష్మ శరీర ధారులు అంటే 14 లోకాల దైవ ఆత్మ వాసులుగాను, కారణ శరీరధారుడు అంటే సహస్ర లోకాల కారణ లోకవాసులుగాను,  పరమాత్మలుగాను  సంకల్ప శరీరధారులుగా అంటే పూర్ణాత్మలుగా ఇష్టలోకవాసులుగా, అదే ఆకాశశరీరధారులుగా అంటే ఏ లోకానికి సంబంధించని స్వప్న శరీర వాసిగా విశ్వమంత విశ్వ ఆత్మగా విశ్వ రూపధారిగా విశ్వవ్యాప్తి చెంది ఉంటారని మాకు అర్థం అయినది.కాకపోతే మనమంతా మన దైవాలంతా మన పరమాత్మలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరమ శూన్యము యొక్క స్వప్న జీవన నాటకము యందు ఆటలో అరటి పండులాగా ఉండటానికి స్వప్న శరీరముతో స్వప్న సాధకుడిగా స్వప్న సాధన చేస్తున్నామని గ్రహించండి.

ఈ జన్మలో ఏ కపాలమోక్ష స్థితికి అర్హత ఉందో తెలుసుకోవాలంటే:

మీరు ఈ జన్మలో ఏ కపాలమోక్ష స్థితికి అర్హత ఉందో తెలుసుకోవాలంటే శివలింగ ఆరాధన ద్వారా తెలుసుకోవచ్చును. 

అది ఏమిటంటే పంచలోహ శివలింగము లేదా రాతి శివలింగం ఆరాధన చేస్తూ ఉంటే మీకు స్థూల శరీర కపాల మోక్షం పొందే అర్హత వస్తుంది. 

అదే స్పటిక /బంగారం/ వెండి శివలింగం ఆరాధన చేస్తూ ఉంటే మీకు సూక్ష్మశరీర కపాల మోక్ష స్థితికి అర్హత వస్తుంది. 

అదే బాణలింగం ఆరాధన చేస్తుంటే మీకు కారణశరీరం కపాల మోక్ష స్థితికి అర్హత వస్తుంది. 

నిజ నవపాషాణం ఇష్టలింగ ఆరాధన చేస్తే మీకు సంకల్ప శరీర కపాల మోక్ష స్థితిని పొందే అర్హత వస్తుంది. 

ఆపై ఆకాశ శరీరానికి ఎలాంటి శివారాధన ఉండదు. ఎందుకంటే ఆకాశమే లింగంగా… ఆత్మయే ఆత్మలింగముగా ఈశ్వర ఆరాధన చేస్తూ మన సహనశక్తిని కోల్పోకుండా తన ఆత్మయే ఆత్మలింగము గావించుకుని ఆత్మ నివేదన భక్తి కలిగి ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి. మేము చెప్పిన లింగాలు కొని ఆరాధన చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనకి ఆయా అర్హతలు వచ్చినప్పుడు ప్రకృతిమాత అయిన జగన్మాత స్వరూపిణి అయిన బాలా-త్రిపుర-సుందరి- దేవి మన సాధన శక్తికి వివిధ యోగ పరీక్షలు పెట్టి అందులో నెగ్గిన వారికి లింగాలను ఆయా సమయాలలో మనకి తగ్గట్లుగా మనకి కావలసిన విధంగా మన గురువులు చేత ఇస్తుందని గ్రహించండి. కేవలం మీరంతా ఆలోచన, సంకల్పము, స్పందన, భయము, ఆశలకి లోనుకాకుండా సహన శక్తితో మీకు వచ్చిన లింగాలను మూడు నుండి పన్నెండు సంవత్సరాల పాటు కాపాడుకుంటూ ఎవరికీ ఇవ్వకుండా నిత్యార్చనలో ఉంచుకుని సాధన చెయ్యగలిగితే ఆ వచ్చిన లింగాల ఆరాధన బట్టి ఆయా శరీర కపాలమోక్షం అర్హత వస్తుందని అలాగే వేరే లింగాలను ఆరాధన చేసే యోగ్యత వస్తుందని నా స్వానుభవం ద్వారా తెలుసుకోవడం జరిగినది. 

ఇలా నాకు వచ్చిన వెండి లింగం, పాదరస లింగం, సూర్యకాంత బాణలింగం, నవపాషాణం  ఇష్టలింగం:

అనగా మా తొలి శివ లింగ ఆరాధన వెండి లింగ ఆరాధన తో మొదలయ్యి అటుపై పాదరస లింగం ఆరాధన ఆపై సూర్యకాంత బాణలింగం ఆరాధన ఆపై నవపాషాణం  ఇష్టలింగ ఆరాధనతో పూర్తి అయినది. ఇలా ఈ నాలుగు శివలింగ ఆరాధనలతో అనగా వెండి శివ లింగ ఆరాధన పన్నెండో ఏట నుండి మొదలై 24వ యేట పాదరస లింగం ఆరాధన మొదలై ఆపై 32వ ఏట సూర్యకాంత అనే లింగ ఆరాధన మొదలై ఆపై 36వ ఏట బాణలింగం ఆరాధనతో 40వ ఏట ఇష్టలింగ ఆరాధన మొదలైనది అని గ్రహించండి.ఆపై  ప్రస్తుతానికి నీలి ఆకాశంకేసి చూస్తూ విశ్వ లింగారాధనతో ఆకాశమే లింగంగా అనగా ఆత్మలింగంగా ఆరాధన చేస్తున్నాము. అనగా ఆకాశ శరీర కపాలమోక్షం స్థితికి అర్హత కోసం కాశీ క్షేత్రంలో మరణం పొందటానికి అలాగే జీవ సమాధి స్థితిని పొందటానికి ప్రస్తుతం ఆత్మలింగ ఈశ్వరారాధన చేస్తున్నాము అన్నమాట. అలాగే మొట్టమొదటి శివ లింగ ఆరాధన అనగా పంచలోహ/ బంగారము/వెండి/రాతి శివలింగ ఆరాధనలో 100 మందికి 40 మంది మాత్రమే సిద్ధి పొందితే అదే స్పటిక లేదా పాదరస లింగం ఆరాధనలో 30 మంది సిద్ది పొందితే బాణలింగం ఆరాధనలో 20 మంది సిద్ది పొందితే ఇష్టలింగ ఆరాధనలో తొమ్మిది మంది మాత్రమే సిద్ది పొందితే ఒకే ఒక్కడు మాత్రము ఆకాశ లింగం అయిన ఆత్మలింగ ఆరాధనలో సిద్ధి పొందుతున్నాడు అని అవగతమైనది. ఆకాశ శరీర కపాలమోక్షంకి అర్హత మాత్రమే పొందుతున్నాడు అని మాకు స్పురణ అయినది. అంటే వీరికి వచ్చిన శివలింగ ఆరాధనను 12 సంవత్సరాల పాటు చేయలేకపోవటం లేదా లింగాలను పోగొట్టుకోవడం లేదా నేల మీద లింగాలు పగలు కొట్టుకోవటం లేదా వీటిని వేరే వారికి ఇవ్వటం చేస్తూ ఉండటం జరుగుతోందని యోగసాధకులు అనుభవాల ద్వారా తెలుసుకోవడంతో మాకు వచ్చిన ఈ నాలుగు శివలింగం మూర్తులను చాలా భద్రముగా దాచుకుని శివలింగ ఆరాధనను 48 (12x4=48) సంవత్సరాలు  చేస్తున్నాము.  ప్రస్తుతానికి 40 సంవత్సరాలు పూర్తి అయినాయి. ఇంకా 8 సంవత్సరాలు పాటు ఈ లింగ ఆరాధనతో పాటు ఆత్మలింగం ఆరాధన చేస్తే ఆకాశ శరీర కపాలమోక్షం స్థితికి అర్హత లభించినట్లే అవుతుంది. అంటే ఈ పాటికి మేము  అలాగే మా జిజ్ఞాసి గూడ ఈ నాలుగు శివలింగం ఆరాధన వలన నాలుగు శరీర కపాలమోక్షం స్థితికి పొందడానికి అర్హత సంపాదించి యోగ సిద్ధి పొందినామని ఈ పాటికే గ్రహించి ఉంటారు. కానీ మా ఆకాశ శరీరము కపాలమోక్షం సిద్ధికి 12 సంవత్సరాల పాటు ప్రాణశక్తితో మేము ఉండాలి. కానీ మాకు ఈ యోగము లేనందున అలాగే మా బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్ర చితాగ్ని 10లక్షల దహనశక్తిని మేము తట్టుకోలేమని మేము ఒక లిప్త కాలము పాటు సహన శక్తిని కోల్పోవడం జరుగుతుందని మాకు స్పురణ రావడముతో ఆకాశ శరీర స్వప్న శరీరముతో ఈ విశ్వ జీవనాటకము నుండి శాంతిని పొంది ఆత్మ శాంతిని పొంది జీవన ముక్తిని పొంది ఆటలో అరటి పండులాగా ఈ జీవ నాటకము చూసే మౌన బ్రహ్మగా సాక్షి భూతముగా చూసే మా సద్గురు శ్రీ త్రైలింగ స్వామిలాగా మేము కూడా స్వప్న శరీరముతో ఈ విశ్వాత్మగా మారి ఈ విశ్వమంతా విశ్వ వ్యాప్తి చెందుతామని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా.మరి మా కపాలమోక్షం స్థితి ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవాలని ఉందా? అలాగే కనిపించే విశ్వము నిజమేనా కాదా అనే ధర్మసందేహము కల్గినది.మరి దీని సమాధానము తెలుసుకోవాలని ఉందా? ఇంకా ఆలస్యం ఎందుకు. మాతో పాటు ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి. 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

*************************************
సూచన: పరమ యోగులను పరమ గురువులను సందర్శించినప్పుడు మీరు మోక్షప్రాప్తి పొందినారా అని అడగకండి. ఎందుకంటే ఇది పొందామో లేదో చెప్పలేని అలవికాని విచిత్ర అనుభవ స్థితి. ఎలా అంటే మరణించేవారికి వాడు కొన్ని క్షణాలలో మరణము పొందుతాడనే జ్ఞాన స్పురణ కలిగి ఉంటాడు. కానీ తాను మరణించిన విషయం తనకి తెలియకుండానే ఎలా అయితే మరణమును పొందుతాడో అలాగే మోక్షప్రాప్తి కూడా అన్నమాట. తనకు ఎప్పుడూ మోక్షప్రాప్తి కలుగుతుందో చెప్పగలరు కానీ తాను మోక్షము పొందిన విషయమును చెప్పలేరు కదా. చెప్పితే పొందినట్లే కాదు. చెప్పకపోతే పొందినట్లే అని చెప్పలేని స్థితి. మౌన స్థితి.. నిశ్చలస్థితి... ఆత్మశాంతి స్థితి... పరమ ప్రశాంత స్థితి. ఇదియే బ్రహ్మ కపాలమోక్షం.
 

 

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. saadhakudiki maadu praantham methapadi appadidaaka moosukunna brahmarandram theruchukuntundani, nija saadhakudu pasi pillavaadi manahsthathvam kaligi untadani, Kapalamoksham sthithi praarambham gurthugaa brahmarandram vadda veluguthu thiruguthunna bhuchakram darshanamisthundi. krishnabilvam darshanam isthey saadhakudu karmashesham lekundaa karmalu kshayam avuthayi kaani brahmanda chakram chithagni thattukovali. kapalamoksham ante brahmarandram nundi viryam/raktham/agni raavatamani edi vasthe ye ye kapalamoksham sthithi ponduthamane vivarana bagundi. pancha shareeralalo okkodaaniki 7 choppuna 35 kapalaalu untayani 35va di gnaana kapaalanga,36va di praanashakti kapaalanga migilipovatam valana sampurna kapalamoksha sthithini evaru kooda purthi cheyaledani, vishraanthi aalochana maatrame untundani, kapalamoksham enduku inni vidhaalugaa untundane vivarana bagundi.

    రిప్లయితొలగించండి