అధ్యాయం 46


భయపెట్టే భక్తుడు

నాకు నా ప్రారంభ సాధనలో కాపాలికుడు దర్శనం అయినట్లుగా కపాల భోజనం అనే అధ్యాయంలో ఇప్పటికే మీరు చదివి ఉన్నారు కదా. అలాగే తనకు నిజ గురువు దర్శనం కోసం అవిముక్త క్షేత్రము అయిన కాశీ క్షేత్రమునకు నా యోగ మిత్రుడైన జిజ్ఞాసి చేరుకున్నాడని మీరు తెలుసుకున్నారు కదా. అప్పుడు అతను నిజ గురువు కోసం ఈ క్షేత్రము నందు సుమారు ఆరు నెలల పైన ఉన్నాడు. అనుకోకుండా ఒక రోజు ఇతనికి అర్ధరాత్రి పూట మణికర్ణికా ఘాట్ నందు వయోవృద్ధులుగా ఉన్న నిజ అఘోర సాధకులు కనిపించారు. వాళ్ల మాటల్ని బట్టి ఈరోజు అమావాస్య కావటంవలన స్వయంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఘాట్ నందు  అర్ధరాత్రి పూట అఘోర సాధన చేస్తారని దానిని చూసే మనోధైర్యం కానీ, చూసే భాగ్యం కానీ అందరికీ దొరకదని, ప్రాణం మీద ఆశ వదిలేసిన కోటి మంది జీవులలో ఏదో ఒక జీవుడికి మాత్రమే దక్కుతుందని మన వాడు విన్నాడు.ఒకవేళ తనకు నిజ గురువు దొరకకపోతే ఈ క్షేత్రంలోనే శరీరత్యాగం చేసుకోవాలని ముందుగానే నిశ్చయించుకొని రావడంతో అది ఏదో ఈ అఘోర సాధన చూసి ఆపై నిజ గురువు దొరకకపోతే శరీరత్యాగం చేయవచ్చు కదా అని నిర్ణయించుకున్నాడు. ఇంతలో అక్కడ ఉన్న అఘోర సాధకులు అంతా మౌనంగా ఈ ఘాట్ వదిలి వెళ్ళి పోవడం ప్రారంభించినారు. 

అక్కడ ఎవరూ లేరు. కాలుతున్న శవాలు తప్పితే.  వెంటనే మన జిజ్ఞాసి అక్కడే ఉన్న కట్టెలమోపు వెనకాల నక్కి అఘోర సాధన చేసే అఘోరమూర్తి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో సమయం అర్ధరాత్రి గావస్తుంది.కీచురాళ్ళ రొద వినిపిస్తోంది. దూరం నుంచి కుక్కల అరుపులు రోదనగా వినబడుతున్నాయి. గబ్బిలాల శబ్దాలు, గుడ్లగూబ శబ్దాలు వినబడుతున్నాయి. ఇవి కూడా జరగబోయే ఈ తాంత్రిక కార్యక్రమం చూడటానికి మన జిజ్ఞాసితో పాటుగా ఎదురు చూస్తున్నాయి. అక్కడికి కపాలమాలలు ధరించి ఒక చేతిలో మానవ ఎముక ధరించి చూడటానికి భయంకరంగా బీభత్సంగా ఉన్న వ్యక్తి ఈ ఘాట్ యందు ప్రవేశించినాడు. చుట్టూ చూశాడు. అక్కడ అప్పుడే కపాలం పేలిన  'ఠఫ్' మని శబ్దం వినబడిన శవాగ్ని దగ్గరికి చేరుకొని ఇతను చుట్టూ చూస్తూఎవరూ లేరని నిర్ధారించుకుని “ఓం నమశ్శివాయ” అంటూ మండుతున్న శవ చితి నుంచి తగలబడుతున్న  ఆ శవం యొక్క ఒక కాలి తొడని బయటికి తీశాడు.  దానిని గదలా భుజం మీద పెట్టుకుని ఈ ఘాట్ మధ్య ఖాళీ ప్రదేశమునకు చేరుకున్నాడు.అప్పుడు తన సంచిలో నుంచి ఒక చిన్న రేకు డబ్బాను బయటికి తీసి అందులో నుంచి నల్లటి బొగ్గుపొడి, తెల్లటి ముగ్గు, ఎర్రటి కుంకుమ, పసుపు పొడి బయటికి తీసి బొగ్గుతో నేలమీద అష్టదళ పద్మము ఒకటి గీసి దానిమీద పసుపు కుంకుమలు వేసి అందులో సంస్కృత భాషలో బీజాక్షరాలు వేసి ఒకయంత్రం లాగా గీసినాడు. అప్పుడు ఈ యంత్ర మధ్యభాగంలో చితుకులు పోపు గా చేసి అగ్ని స్థాపన మంత్రాలు చదవడం ప్రారంభించినాడు. వెనువెంటనే చితుకులు వాటి అంతట అవే మండటం ఆరంభించాయి. నిమిషాలలో ఒక పెద్ద మంటగా రాజుకుంది. ఆ తర్వాత ఓ మనిషి కపాలం తీసుకొని దానిమీద ఒక మనిషి ఎముక నుంచి దానిని ప్రమిదలా చేసి అందులో మనిషి కొవ్వుతో దానిని వెలిగించడం మన జిజ్ఞాసి చూసేసరికి నెమ్మది నెమ్మదిగా మన వాడిలో భయం తాలూకు సూచనలు మొదలయ్యాయి.  ఆపైన తను తెచ్చిన గదలాంటి  మనిషి తొడ ఎముకను గుండ్రముగా అప్రదక్షిణంగా గాలిలో త్రిప్పుతూ "ఓం రక్త చాముండాయై నమః ,ఓం హ్రీం స్మశాన భద్రకాళ్యై నమః,ఓం హ్రీంకపాల మాలికాయై నమః,ఓం హ్రీం స్మశాన మాతంగియై నమః,ఓం  ఠం ప్రత్యంగిరా భూతధాత్రై నమః అంటూ భయంకరమైన తాంత్రిక దేవతలను ఆవాహన చేస్తూ మానవ చర్మంతో చేసిన చర్మ ఆసనం మీద కూర్చుని అప్పుడే మనిషి పుర్రెలో పట్టిన మానవ రక్తంను తన ముందు ఉంచుకొని చిన్నపాటి పుర్రెల దంతాలమాల మెడలో వేసుకుంటూ చితి మీద ఉన్న బూడిదను విభూతి రేఖలుగా శరీరమంతా పూసుకొని నగ్నంగా మారి తన భుజంపై వ్రేలాడుతున్న  కొమ్ము బూరను ఒక పెద్ద సింహగర్జన లాగా నాలుగు దిక్కుల వైపు తిరిగి పూరించాడు.ఈ శబ్దానికి స్మశానం ఘాట్ చుట్టూ ఉన్న గ్రద్దలు, గుడ్లగూబలు, రాబందులు, పక్షులు సందడిగా ఈ సాధకుడు ముందున్న శవం చుట్టూ వాలినాయి.  ఆ తర్వాత అక్కడికి కుక్కలు, నక్కలు చేరడం మొదలయింది. ఇంతలో అతను పెద్దగా మంత్రాలు చదువుతూ మరణించిన వారి ప్రేతాత్మలను పిలుస్తూ అప్పుడు వాటిని ఆహ్వానించసాగినాడు.

అప్పుడు అక్కడికి చేరిన వారిని సంతృప్తి పరచడానికి ఇతను తాండవ నృత్యం చేస్తూ అప్పుడప్పుడు తను తెచ్చుకున్న కల్లు త్రాగుతూ తన చేతిలో ఉన్న మానవ తొడ ఎముక తో తన శరీరమును బాధ పెట్టుకో సాగినాడు. మధ్యమధ్యలో మనిషి కపాలంలో ఉన్న రక్తం త్రాగుతూ కొంత వంటికి పూసుకుంటూ తన శరీరం నుండి కారే రక్తం పట్టుకుంటూ తన శరీరం నుంచి కొంత కొంత మాంసం ముక్కలు గా కోసి అక్కడున్న పక్షులకు భూతాలకి భూత బలిగా వేయటం ప్రారంభించేసరికి  జిజ్ఞాసికి నెమ్మదిగా కళ్లు తిరగటం ఆరంభించాయి. నెమ్మదిగా ఏదో తెలియని మగత నిద్ర ఆవహించడం గమనించాడు.  అయినా కూడా బలవంతంగా కళ్ళు తెరుచుకొని భయంతో, ఆవేదనతో, బాధతో, జరగబోయే తంతును చూడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు తన ప్రమేయం లేకుండా బలవంతంగా కళ్ళు మూతలు పడుతున్నా తెరుచుకొని చూడటం ఆరంభించాడు. ఇవేమీ పట్టించుకోని అఘోరమూర్తి మైకం లాంటి తన్మయత్వంతో భయంకరమైన తాండవ నృత్యం చేస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ శివతాండవం చేస్తున్నాడు.ఇంతలో అతను అక్కడ తన ప్రక్కనే ఉన్న తెల్లని గుడ్డ ఒక ముసుగు తొలగించగానే అందులో నిద్రపోతున్న నగ్న స్త్రీ మూర్తి మన వాడికి కనిపించినది. అప్పుడు ఈ అఘోర మూర్తి వెంటనే ఆమెను తన చేతిలో ఉన్న మానవ ఎముక తో గట్టిగా బాది ఆమెను బలవంతంగా చేసే తను చేసే పూజ దగ్గరికి బర బరా లాక్కొని వచ్చి ఆమె నోటిలో మానవ రక్తం అలాగే బలవంతంగా కల్లు పోస్తూ ఉండేసరికి  మన వాడికి వీరావేశము మొదలైంది. వీడి అమాయక పిచ్చిలో ఆమెను ఏమిచేస్తాడో అనుకునేలోగా ఆమె తల మీద తన ఎముకతో దడేలు అంటూ బాదటం ఆపై ఆమె కాస్త విపరీతమైన బాధతో ఆర్తనాదం చేయడం అటుపిమ్మట వీడు ఆమె కాళ్లు పట్టుకొని మెరుపులా ఆకాశంలో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టడం ఏకకాలంలో జరిగిపోయాయి.

మన వాడికి అసలు అక్కడ ఏమి జరుగుతుందో అర్ధమయ్యే లోపలే నేల మీద నేలకేసి ఈమెను కొట్టిన చోట ఆ శవము బదులుగా భగ్గున జ్వాల వంటిది రావటం ఆపై ఈ ఘాట్ అంతా కూడా తెల్లని పొగతో వ్యాపించటం, పొగ మధ్యలో అనగా అష్టదళ పద్మము నందు మూడు ముఖాలతో రుద్రాక్షమాలలతో వివిధ చేతులతో ఆయుధాలతో నాలుగు కుక్కలతో ఉన్న ఒక దివ్య పురుషుడు లీలా మాత్రుడిగా కనబడటం ఇంతలో  ఒక మహా శంఖ ధ్వని ఆపై దిక్కులు మారుమ్రోగేల వెనకనుంచి ఏవో వేదమంత్రాలు వేదపండితులు చదువుతున్నట్లుగా శ్రావ్యంగా వేద ఘోష వినిపించేసరికి ఈ దివ్య పురుషులు మన దత్తాత్రేయస్వామి లాగా ఉన్నాడని మన జిజ్ఞాసికి స్ఫురణ వచ్చి ఆయనను దర్శించుకునే లోపలే మన వాడికి అమితమైన మగత నిద్ర ఆవరించింది. ఆ తర్వాత మన వాడికి మూడు రోజుల తర్వాత గాని మగత నిద్ర నుంచి మెలకువ రాలేదు. నిద్ర లేచిన తర్వాత తను చూసిన దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని వాటిని కాగితం మీద రాసుకుని ఈ విధంగా దత్తాత్రేయ దర్శనం అయినందుకు ఆనందపడుతూ ఖచ్చితంగా తనకి నిజ గురువు అనుగ్రహం ప్రాప్తి కలుగుతుందని ఆనందపడుతూ అక్కడే ఉన్న గంగానదిలో స్నానం చేయడానికి బయలుదేరినాడు. ఇంతకీ మన వాడికి నిజ గురువు దొరికినాడో లేదో తెలుసుకోవాలంటే ....

రోడ్డు మీద ముగ్గురు అమ్మల దర్శనము 
(జిఙ్ఞాసి గురు దర్శనం):


నిజ గురువు కోసం మా జిఙ్ఞాసి కాస్త మహిమాన్వితమైన కాశీ క్షేత్రమునకు చేరుకొని మణికర్ణికా ఘాట్ కి చేరుకొని అఘోర దత్తత్రేయస్వామి చేసే అఘోర సాధన విధానము చూసినారని ఇంతకు ముందు అధ్యాయములో తెలుసుకున్నాము గదా!ఇపుడు వారి మాటలలోనే తనకి నిజగురుదర్శనప్రాప్తి ఎలా కలిగినదో విందాం!. ఈసారి కూడా నిజ గురువు దొరకకపోతే ఘాట్లోని చితాగ్నిలో చనిపోవాలని కృత నిశ్చయించుకొని శివ పంచాక్షరి మంత్రము మహా మంత్రము శ్రద్ధగా చేయటం ప్రారంభించాడు. ఇలా దాదాపుగా మూడు గంటల పైన అయినది. ఎవరో ఒకాయన ఈ ఘాట్ నందు మధ్యాహ్న గంగా స్నానము చేయటానికి రావడంతో మన వాడి దృష్టి ఈయన మీద పడటంతో ధ్యాన భంగం అయినది. ఆయన యధావిధిగా స్నానం చేసి  బయటకు వస్తుంటే ఇంతలో ఎవరో ఆయన దగ్గరికి వచ్చి దేని గూర్చో చెప్పగానే ఈయన వెంటనే తన చేతికి ఉన్న ఒక బంగారపు ఉంగరం ఇచ్చివేయడం చూసేసరికి మా జిజ్ఞాసి ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. ఆయన మాత్రం ఇవేమి పట్టించుకోకుండా కొంతసేపు ధ్యానం చేసుకుని బయలుదేరి వెళ్ళి పోతూ మా వాడి వైపు ఒక క్షణం పాటు తీక్షణంగా చూసి “ నువ్వు ఎవ్వరివి అని వెతక్కుండా ఇలా నది ఒడ్డున కూర్చుంటే  ఏమీ లాభం లేదు రా! నువ్వు ఎవరివో నువ్వే తెలుసుకోవాలి.  అందుకు సాధనలో ప్రయత్నించాలి” అనగానే వెంటనే మన వాడు ఆశ్చర్యం చెందుతూ నా మనస్సులో ఉన్న సందేహం నేను అడగకుండానే చెబుతున్నారంటే ఈయన నిజంగా గురువు అయ్యి ఉండాలి అనుకుంటూ “స్వామి!  మీరు ఎవరు?” అనగానే దానికి ఆయన వెంటనే “నేను నేనే. పంచ భూతాత్మకమైన ఈ సృష్టిలోని ప్రతి అణువులో అంతర్లీనంగా నేనే ఉన్నాను. నేను లేనిది నేను కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు. సకల సృష్టికి గురు స్వరూపం కూడా నేనే” అని చెప్పగానే మన వాడికి విషయం ఏమిటో అర్థమైంది. వెంటనే “అయితే అన్ని నీవే అయినప్పుడు ఈ లోక జీవులకు కష్టసుఖాలు ఎందుకు కలుగుతున్నాయి” అని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన వెంటనే “నీలోను నేనే ఉన్నాను.నీలో ఉన్న నేను జీవుడు రూపం లో ఉన్నాను. కానీ నేనే అనే అహం మాయ లో ఉన్నాను. అలాగే ఈ జీవుడు రూపంలో నేను కాని నేనుగా నేనే ఈ పరమాత్మ రూపంలో జీవుడి హృదయ కమలంలో ఉన్నాను. కానీ తనకున్న జీవ మాయ వలన నేను అనేది నేను కానీ నేనును గుర్తించడం లేదు. ఇలా నేను అనే భావన ఉన్నంత వరకు జీవాత్మగాను పరమాత్మ అనే భేదభావంతో కనిపిస్తాను.తద్వారా జీవాత్మగా ఉన్నంతవరకు ఈ కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉంటాను.కానీ ఆ నేను అన్న భావన తొలగిపోతే నీవే నేనుగా మారిపోతావు. నాకు లాగే సచ్చిదానంద స్వరూపుడుగా ఉండిపోతావు. పద నాయనా! నీకు తారకరామ మంత్రోపదేశం చేస్తాను” అంటూ మన జిజ్ఞాసను గంగ లోకి తీసుకుని వెళ్లి తారక రామ మంత్రం ఉపదేశం చేసిన తర్వాత ఆయన కాస్త గంగా నీళ్ళలోనే అంతర్ధానమయ్యారు.బహుశా ఇలా ఈయన రూపంలో నడయాడే కాశీ విశ్వనాథ్ శ్రీత్రైలింగ స్వామి వారే వచ్చి వీడికి గురుమంత్రం ఉపదేశం చేసి ఉంటారని వాడి అనుభవం చెబుతుంటే నాకు ఈయన సద్గురువుగా వస్తే...మన వాడికి మంత్రగురువుగా రావడము జరిగినదని మాకు అర్థం అయినది. ఇలా ఆయన ఒక్కరే ఈ కాశీక్షేత్రంలో ఇప్పటికీ సశరీరంలో సంచారం చేస్తూ అవసరమైన వారికి అవసరమైన వాటిని ఇస్తూ నిత్య సత్యుడుగా తిరుగుతూనే ఉంటున్నారని కాశీ వాసులు అనేక సత్య అనుభవాలు కోకొల్లలుగా చెప్పడం జరుగుతుంది. ఇలా ఆయన ఇచ్చిన మంత్రము మనవాడు నిత్యము చేసుకుంటూ మూడున్నర సంవత్సరాల తర్వాత శ్రీరామ సాక్షాత్కారము పొంది ఆపై ఈ మంత్ర దేవత ఇచ్చే అన్నిరకాల సిద్ధులు మాకు లాగానే (గాయత్రి మాత సిద్ధులు) పొంది వాటిని నానా కష్టాలు పడి వదిలించుకుని అదుపులో ఉంచుకున్నాడు. 

శ్రీరామ సాక్షాత్కారం అనుగ్రహం వలన  దీక్ష గురు వివరాలు తెలుసుకొని శ్రీశైల క్షేత్రమునకు బయలుదేరినాడు. క్షేత్రానికి చేరుకొని మెట్ల మార్గంలో పాతాళ గంగ చేరుతున్న సమయంలో లింగాల గుట్ట ప్రాంత గుడి పరిసరాలలో ఒక వ్యక్తి చేసే పూజ వీడి దృష్టిలో పడింది. ఈయన చూస్తే నల్లటి వస్త్రాలు ధరించి కాపాలికుడు గా ఉండి చేతిలో కపాలం పెట్టుకుని ముందు వైపు బాలాదేవి విగ్రహం ఆరాధన చేస్తున్నట్టుగా అగుపించింది. దక్షిణాచారంలో ఉన్నబాల దేవతను వామాచారంలో ఇలా ఎందుకు చేస్తున్నాడు అర్థం అవ్వక ఆ స్వామిని అసలు విషయం అడుగుదామని అనిపించి అడిగే ధైర్యం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఈ కాపాలిక స్వామి వీడు వైపు తిరిగి “ఆచారాలు లేని వారితో నీకు ఏమి పని. నువ్వు వచ్చిన పని చూసుకో. గంగలో దూకి శరీర శుద్ధి చేసుకో.ఆత్మశుద్ధి ఉన్నవాడికి ఆచార వ్యవహారాలతో పని ఉండదు. దేహశుద్ధి ఉన్నవాడికే ఆచారవ్యవహారాలు కావాలి. నాకెందుకు ఆచారాలు. ఆత్మశుద్ధి కోసం చేసే ప్రయత్నంలో ఉన్నాను. నువ్వు చూస్తే నాకు లాగానే అటూ ఇటూ కాకుండా నీ మనస్సులో ఉన్నావు. కాశీ క్షేత్రంలో దేహశుద్ధి మంత్రమును పొందిన తృప్తి చెందలేదా!.ఇప్పుడు ఆత్మశుద్ధికై బయలుదేరినావా” అనగానే మన వాడికి కథ అంతా అర్థమైనది.  

తనకు దీక్ష గురువు తానే అయి ఉంటాడని బలం గా అనిపించసాగింది. కానీ ఎందుకో తెలియని ఏదో మూల అసంశయ బుద్ధి వలన సందేహంగా ఉంది.   ఏమి చేయాలి అనుకుంటూ “స్వామి! మీరు చూస్తుంటే అమ్మవారి ఉపాసకుడు గా కనబడుతున్నారు. మరి మీకు అమ్మ దర్శనం అయినదా! నాకు దర్శనం ఇప్పించగలరా” అని అన్నాడు. దానికి ఆయన పెద్దగా నవ్వుతూ “పిచ్చోడా! అమ్మ లేని చోటు ఉందా! అమ్మ కనిపించని రేణువు ఉందా! చూసేవాడు ఉంటే అమ్మ కనిపించకుండా ఉంటుందా! అయితే అక్కడ రోడ్డు మీద చూడు.  బాలమ్మ, త్రిపురమ్మ, సుందరి అమ్మ వెళ్తున్నారు. ఏకకాలంలో త్రి మాతలను చూసే అదృష్ట జాతకుడివిరా! అటు చూడు. అమ్మలను చూడు. అనగానే మన వాడు ఎంతో ఆశగా ఆయన చూపించిన దిక్కు కేసి చూస్తే రోడ్డు మీద ఐదు సంవత్సరాల పాప, 35 సంవత్సరాల స్త్రీ 65 సంవత్సరాల వృద్ధ స్త్రీ కలిసి మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వృద్ధ స్త్రీ అమ్మమ్మ, స్త్రీ మూర్తి కూతురు, ఐదు సంవత్సరముల పాప మనవరాలు అయి ఉండాలి. మీరు చూపించే వీరి ముగ్గురిని చూపించి త్రి మాతలు అంటున్నారు నిజమేనా? అనే సందేహం రాగానే వెంటనే ఆయన పెద్దగా నవ్వి “ఏమిరా అలా కనిపించడం లేదా! ఆభరణాలు లేని ఆ త్రిమాతలను నువ్వే గుర్తించ లేనప్పుడు మేము చూపినా వారి మీద నమ్మకం లేనప్పుడు విగ్రహమూర్తిని రూపాలుగా నమ్ముతావా! ప్రాణం ఉన్న వాటిని నమ్మవు గాని ప్రాణం లేని వాటిని ఎలా నమ్ముతున్నావురా! బాలమ్మ అంటే ఐదు సంవత్సరాల పాప కదరా! త్రిపుర అమ్మ అంటే 35 సంవత్సరాల స్త్రీమూర్తి అని , 65 సంవత్సరాలు ఉంటే సుందరి అని హైందవ మత గ్రంధాలు చెప్పిన వాటిని  మీద కూడా నమ్మకం లేదు లేదురా! విగ్రహారాధనను దాటి విశ్వ ఆరాధనకు రా! జీవాత్మను దాటి విశ్వాత్మ గా మారు! అప్పుడే పదార్ధము దాటితేగాని యదార్థము బయటికి రాదు” అనగానే మనవాడు కాస్త ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. ఇది ఆయన గమనించి వీడి చెవిలో శివశక్తి కి సంబంధించి మూల మంత్రం చెప్పటం ఆ క్షణమే వీడి శరీరంలో కుండలిని శక్తి కదలికలు ఏర్పడటం ఆరంభమయ్యాయి. ఇక వాడు మూడు రోజులపాటు ఆయన సమక్షంలో మెలకువ రాని యోగనిద్రను మూడు రోజులు నిద్రపోయాడు.ఆ తర్వాత మెలుకువ వచ్చి నిద్రమత్తులో ఆయనకి నమస్కారం చేసి ఆ శివయ్య దర్శనం చేసుకోకుండా తానే శివుడు అనే బ్రహ్మ జ్ఞాన  అనుభవ అనుభూతి పొందటానికి అనగా మేము జ్ఞానమార్గంలో యోగ సాధన మొదలు పెడితే మా జిఙ్ఞాసి కాస్తా సిద్ధ మార్గంలో మొదలు పెట్టినాడు. 

భక్తి లేని భక్తురాలు:

ఈవిడ ఎవరో కాదు స్వయానా మా అక్క గారైన కళ్యాణి గారు. తనకు తన అన్న లాగా సైన్స్ విజ్ఞానం అలాగే ఆధ్యాత్మిక విషయాలు అంతగా తెలియవు. ఏది ఏమైనా అవసరం ఉన్నంతవరకే తెలుసుకుంటుంది . తనకు ఉపయోగ పడేలా చేసుకుంటుంది. పూజలు కూడా తనకోసం చేయదు. తన కుటుంబ అవసరాల దృష్ట్యా చేస్తుంది. ఏది ఎంతవరకు తెలుసుకోవాలో ఏది ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేస్తుంది. తనకి ఉపయోగపడని దానిని పట్టించుకోదు. అభిమానం, అవమానం ఒకేరకంగా చూస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే శారీరకంగా పూజలు చేయకపోయినా మానసికంగా మనస్సులో 20 నిమిషాలైనా స్థిరత్వం నిలబెడుతుందని నాకు అర్థమైనది. నా బొంద! నా బూడిద! ఇక్కడ నేను నిత్య పూజారిని. కానీ మనస్సు లగ్నం చేసే సమయంలో కొన్ని లిప్తకాలాలే ఉండటంతో మా అక్క లాంటి మనస్సు భక్తిని అలవర్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుండేవాడిని.  అది అనుకున్నంత తేలిక అయిన విషయం కాదని నాకు అర్థమైనది. 

పూజలు చేయని ఈమెకి ఎలా ఈ భక్తి వచ్చినదో అడిగితే దానికి ఆమె “అవేమీ నాకు తెలియదు రా… విగ్రహం ముందుకు వెళ్లి ఏ కోరిక కోరకుండా కేవలం నమస్కారం పెట్టి వస్తాను. ఇది పెట్టుకునేటప్పుడు నా మనస్సులో ఎలాంటి ఆలోచనలు, కోరికలు రావు. ఉండవు. కొన్ని నిమిషాల పాటు నా మనస్సును మీరు పూజించే దైవం మీద పెడతాను. అంతే! ఆ తర్వాత నా పనులను నేను చూసుకుంటాను. ఇలా ప్రతి రోజూ కూడా చేయను. నా కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే చేస్తాను. నాకు ఆయనని ఏమీ అడగాలని ఉండదు. మనల్ని పుట్టించినవాడికి మనకు ఏమి కావాలో తెలిసే ఉంటుంది కదా” అని చెప్పి అక్కడ ఉన్న దైవానికి మరోమారు నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు లీలగా నవవిధ భక్తిలలో నమస్కారం భక్తి అనేది ఒకటి ఉంటుందని బాబా వారు చెప్పిన ఈ భక్తి అంటే ఇదే కాబోలు అనుకుని నేను ఈమెకు నమస్కారం చేసుకున్నాను. ఇప్పుడు నమస్కారం భక్తి చూసినారు కదా!అలాగే అమాయకత్వ భక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా! 

గమనిక:ఈమె ద్వారా భక్తి అంటే విగ్రహపూజ కాదని మనస్సును నిలబెట్టడం అని తెలుసుకున్నాను. మనస్సుకు స్థిరత్వం ఇవ్వటానికి విగ్రహం నుండి సర్వాంతర్యామిగా మారటానికి ఎన్నో సాధన ప్రక్రియలు విగ్రహారాధన నుండి విశ్వఆరాధన దాకా అంతర్యామి నుండి సర్వాంతర్యామి దాకా మారటానికి ఎన్నో సాధనలు ప్రక్రియలు ఉంచినారని అనగా భక్తి మార్గాలలో ఈ మొదటిదైన శ్రవణ భక్తి అలాగే చివరిదైన ఆత్మనివేదన భక్తి చేరుకోవాలని విగ్రహారాధన దగ్గరే ఆగిపోకూడదని దీనిని దాటాలని ఈమె దగ్గర నేర్చుకున్నాను. తెలుసుకున్నాను. నా సాధన పరిసమాప్తి సమయంలో నా సాధన శక్తి సహస్రార చక్రమునందు ఉండగా మా అక్క మా ఇంటికి వచ్చినప్పుడు రాత్రిపూట ఆమెకి మా ఇంట్లో ముదురు ఆకుపచ్చ చీర కట్టుకుని ఉన్న ఒక 65 సంవత్సరాల స్త్రీ మూర్తి తిరుగుతూ కనిపించేసరికి అది కలగాదని నిజంగానే తన భౌతిక కళ్ళతో చూసినట్టుగా ఉంది అని నాతో చెప్పగానే అప్పుడు ఈమె సుందరి రూపంతో మాకు యోగ మాయ పరీక్ష పెట్టటానికి అమ్మవారు తిరుగుతూ సిద్ధమవుతుందని తెలిసినది. ఆనాటి నుండి సుందరి మాత అమ్మవారి కోసం ఎదురుచూడటం జరిగినది. మా అక్క లాగానే మా బావ గారు కూడా అవసరమైతే పూజలు అవసరం లేదంటే నమస్కారాలతో సరిపెడతారు. కాకపోతే ఈయనకి దైవ రహస్యాలు అన్నా అలాగే దేవాలయాల్లో వింతలు, అద్భుతాలు జరిగినాయి లేదా జరుగుతున్నాయి అంటే మాత్రము ఆ గుడిలోకి వెళ్లి తన కళ్ళతో చూసి వచ్చినాక ఆ వింతలు విశేషాలు పదిమందికి చెప్పేదాకా నిద్రపోడు. భక్తికి కూడా హద్దులు ఉండాలని ఆయన నమ్మకం. కాకపోతే ప్రతి సంవత్సరము నాకు తెలిసి ఈ దంపతులు వినాయక పూజ చేస్తారు అంతే. మిగతా పండుగలలో నమస్కారం భక్తితో నడిపిస్తారు. నా దృష్టిలో ఎవరి భక్తి తక్కువ కాదు అలాగే ఎక్కువగా కాదు. ఎవరి మనస్సు స్థాయిని బట్టి వారికి తగ్గ భక్తి ఉంటుంది. ఎవరి కోరికలను బట్టి వారి భక్తి పూజా విధానాలు ఉంటాయి. పిండి కొద్దీ రొట్టె. డబ్బులు ఉన్నవాడు పీఠాధిపతులతో పూజలు చేయించుకుంటారు. డబ్బులు లేని వారు తనకి తానే స్వయంగా పూజలు చేసుకుంటారు. ఎవరి భక్తి వారిది ఎవరి పద్ధతి తగ్గట్లుగా వారి భక్తి బట్టి ఫలితం ఉంటుంది.

అమాయకత్వ భక్తుడు:



వీడు స్వయంగా నాకు తమ్ముడు వరస అవుతాడు. మా పెదనాన్నగారి అబ్బాయి. పేరు యజ్ఞ కిషోర్. పాపము అమాయకంగా కనిపించే అతి తెలివైన వాడు. వీడికి అన్ని విషయాలు కావాలి. అవసరం లేని విషయం అంటూ ఏదీ ఉండదు. అలాగే అందరూ కావాలి. ఎవరు ఎప్పుడు ఉపయోగపడతారో అప్పుడు వారిని ఉపయోగించుకోవడంలో మంచి దిట్ట. అందరితో సత్సంబంధాలు ఉంచుకుంటాడు. ఎవరు ఏమి తిట్టినా అవమానించిన బయటపడడు. మనస్సులో ఉంచుకుంటాడు. అవసరమైనప్పుడు దానిని బయటకు తీసి దెబ్బ కొడతాడు. మనుష్యులలో ఇలాగా కూడా ఉంటారని వీడి ద్వారానే నేను తెలుసుకున్నాను.పాపము వీడికి దేవుని యందు అమాయకత్వ భక్తి ఉంది. మా గుడి జాతర జరిగే సమయంలో మా ఊరికి వచ్చేవాడు. చిన్న పూజారిగా నాకు తోడుగా సహాయం చేయటానికి అవతారం ఎత్తేవాడు. పాపము వీడి అమాయకత్వ భక్తితో నన్ను చాలా ఇబ్బంది పెట్టే వాడు. అది ఎలా అంటే వీడికి పసుపుతో గణపతిని పూజ లో ప్రథమ పూజ చేస్తారు అని కూడా వీడికి తెలియదు. 

మా గుడిలో జరిగే జాతర సమయంలో స్వామి వారికి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవములు చేస్తారు. మొదటి రోజు పెళ్లి కొడుకును చేసే తంతు ఉంటుంది. గుడి బయట అన్ని సిద్ధంగానే ఉన్నాయి. ఒకసారి ఈ తంతు ప్రారంభమయ్యే సమయానికి మా నాన్నగారికి పసుపు గణపతి కావలసి వచ్చింది. అది గుడి లోపల శివుడి దగ్గర ఉంది. అక్కడ నాకు ఏదో పని తగిలి నేను ఇంటికి వెళ్ళినాను. మా నాన్నగారు  అక్కడే ఉన్న వీడికి “ఒరేయ్! గుడి లోపల గణపతి ఉంటాడు. దానిని తీసుకొని రా” అన్నాడు.వీడు గుడి లోపలికి వెళ్ళినాడు ఎంతసేపటికి బయటికి రావడం లేదు. దాంతో మా నాన్నకి కోపం వచ్చి పెద్దగా మైక్ లో అరుస్తున్నాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న నాకు గుడిలో ఏదో గడబిడ జరుగుతోందని గబగబా మా అయ్య దగ్గరికి వెళితే ఆయన వెంటనే “మన వాడికి గణపతి ని తీసుకొని రమ్మని చెప్పాను. 10 నిమిషాల పైన అయినది. మన వాడు బయటికి రావడం లేదు  చూడు. వాడు లోపల ఏమి చేస్తున్నాడో చూడు. పూజకి ఆలస్యమవుతోందని” అనగానే లోపల ఉన్న పసుపు గణపతిని తీసుకోవటానికి వీడికి ఇంత సమయము అవసరమా? అని అనుకొని లోపలకి నేను వెళ్లి చూస్తే అసలు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం అవ్వక కొన్ని క్షణాలు బిత్తరపోయినాను. 

ఎందుకంటే మనవాడు పసుపుతో చేసిన గణపతిని కాకుండా అక్కడ ఉన్న మూడు అడుగులు రాతితో చేసిన గణపతి విగ్రహం మూర్తిని కదిలించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే వాడిని ఏమనాలో అర్థం అవ్వక వాడి చేత ఆ పని ఆపించి గుడిలో శివుడి దగ్గర ఉన్న పసుపు గణపతిని వాడి చేత మా అయ్య కి పంపించి పూజ ఆరంభమైనదని తెలుసుకొని కొంత స్థిమితపడి మన వాడిని దగ్గరికి పిలిచి అసలు ఏమి జరిగిందని అనగానే దానికి వాడు అమాయకంగా "ఏముంది బాబాయి! గణపతి ని తీసుకుని రమ్మన్నాడు. గుడి లోపల ఈ గణపతి విగ్రహం కనిపించింది. చూస్తే కదలటం లేదు. రావటం లేదు. అక్కడేమో “బాబాయి! ఏమిరా గణపతిని తీసుకుని వస్తున్నావా లేదా నన్ను రమ్మంటావా?” అంటాడు.ఇక్కడేమో ఈ విగ్రహం రావడం లేదు. దీనిని ఎలా బయటకు తీసుకొని రావాలో అర్థం అవ్వ చావలేదు" అనగానే “అది కాదురా! అంత పెద్ద విగ్రహమూర్తి తో బయట ఏమి పూజ చేస్తారో ఆలోచించవద్దు” అన్నప్పుడు వాడు వెంటనే “నాకు ఏమి తెలుసు? బయట ఊరేగింపు ఉత్సవ విగ్రహం మూర్తులు ఉన్నారు కదా అలాగే ఇది కూడా బయటపెడతారు అనుకున్నాను” అనగానే వాడిని ఏమి అనాలో అర్థం అవ్వలేదు.  వాడు వెంటనే “బాబాయి నాతో ఒరేయ్! నాకు పసుపు గణపతి కావాలని నాకు అర్థమయ్యే విధంగా చెప్పి ఉంటే పసుపు గణపతిని తెచ్చి పెట్టేవాడిని. ఆయనేమో గణపతిని తీసుకొని రమ్మని చెప్పినారు అంతే నాకు గణపతి కనిపించింది కాకపోతే ఇది సమయానికి బయటకి రాలేదు. నువ్వు వచ్చి చెప్పేదాకా ఇది బయటికి రాదని నాకు తెలియదు. ఏమైనా పని నాతో చేయించుకోవాలంటే నాకు అర్థమయ్యే విధంగా పూర్తిగా చెప్పాలి” అని అంటుంటే వాడి అమాయకత్వ భక్తికి నాకు నవ్వు ఆగలేదు. నేను రావటం కొంత ఆలస్యం అయినట్లయితే ఈ రాతి విగ్రహ మూర్తి ని ఎలాగైనా పెకలించి బయటికి తీసుకుని వస్తే బయట ఉన్న వారి పరిస్థితి చూసి ఊహించిన నాకు నవ్వు ఆగలేదు.భక్తి విషయంలో ఆధ్యాత్మిక విషయాలలో ఇలాంటి అమాయకత్వానికి తావు ఇవ్వరాదని, ఉండరాదని ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో వీడి ద్వారా తెలుసుకున్నాను నాకు నేను జాగ్రత్త పడ్డాను. ఇంక నా నిజ గురువులు ఎవరో తెలుసుకోవాలని ఉందా...ఇంక ఆలస్యమెందుకు...ముందుకి నాతో ప్రయాణించండి.

 శుభం భూయాత్

పరమహంస పవనానంద

*******************************


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. aghora saadhakulu cheppinadi vini jeevitham meeda elagu aasha ledani akkade
    undi em chusara ani, alage aghora saadhakulu akkadinundi vellipovadam ante vaaru munde choosi
    unnarannate kada... manishi kapaalam tapp anagane andulo aa kaluthunna shavam kaalu theesi
    akkade yantram geesi, chithukulu vaatanthata avve mandatam, manishi kapaalam lo deepam
    pettadaniki manishi kovvune vaadatam, emuke vathi vammo oohinchukuntene bhayamga undi...ee vidhanga datta darshanam jaragatam adrushtam..
    jignyasi gaariki nija guruvu jignyasi gaaru mantrajapam chesthundaga vaaru okarini
    chudatam ayane ochi veeri tho maatladatam ikkada "nenu" goorchi ayna sambhaashana tharuvatha
    ganga loniki theesukelli tarakamantram upadehinchi akkade anthardaanam avvatam swayamuga
    trailinga swamy vaare raavatam....
    okokkari bhakthi okko vihanga untundani cheppatam bagundi ..... alage entha
    kaavalo anthe theslukovatam annitikante devudi deggara emi adugakuda dandam
    pettukovatam.......
    ee amaayaka bhakti lo aaynadi amaayakathvamo leka ento ardham kaaledu
    endukante evarini ye samayamlo vaadukovalo thelsu, vallu baadha pedithe thirigi kottatam thelsu
    inni thelsina athani lo amayakathvam ledu ani anipinchindi kaani eppudaithe pasupu ganapathi ni
    kakunda ekanga moola vigrahame pekilinchadaniki prayatnam chesaro appudu nijangane
    amayakathvam ani anipinchindi. motham vinte navvu aapukolekapoya. emo konni sandharbhallo
    ardham kademo. kani ee adhyaayam dwara saadhakudu ela undali adhyathmika vishayallo
    amayakathvam paniki raadani cheppatam bagundi.

    రిప్లయితొలగించండి