అధ్యాయం 23


భగవంతుడిని మనము చూడగలమా?

                              ( నీ గూర్చి నీవు తెలుసుకుంటే భగవంతుడిని తెలుసుకున్నట్లే!)

భగవంతుడు ఉన్నాడని… నమ్మటానికి ఆ భగవంతుడిని మనం చూడగలమా? ఇది వరకు ఎవరైనా భగవంతుడిని చూచారా? అనే ప్రశ్నలు వస్తాయి! మనకు కనపడని దానిని నమ్మడమెలాగ? అన్నపుడు దానికి జవాబు తెలుసుకోవడం చాలా అవసరం కదా! మనకు ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం అని రెండు రకాల అనుభవాలు ఉన్నాయి! ప్రత్యక్ష అనుభవం అంటే మనం స్వయంగా అనుభవంతో తెలుసుకునేది! ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు! ఉదాహరణకు ఒక వ్యక్తి తన ముత్తాతను చూడలేకపోవచ్చు !కానీ తాత, తండ్రి మొదలైనవారు ఆ ముత్తాతను గురించి తెలిపినప్పుడు నమ్ముతాము! అనగా మనము చూడకపోయినా చూసినవారు అందులోనూ మనం నమ్మేవారు చెప్పినప్పుడు తప్పక నమ్ముతాము! అలాగే ప్రతివారు విదేశాలకు వెళ్లి అక్కడ వింతలు-విశేషాలు చూడలేరు కానీ అక్కడికి వెళ్లి వచ్చిన వారు చెప్పితే నమ్ముతాము కదా! దీనినే పరోక్ష అనుభవం అంటారు! అనగా ఇతరులు చెప్పింది నమ్మటం అన్నమాట! మనం భగవంతుడిని దర్శించ లేదు కానీ భగవంతుడిని దర్శించిన సిద్ధపురుషులు అన్ని దేశాలలో, అన్ని కాలాల్లోనూ ఉన్నారు! భగవంతుడు ఉన్నారని తాము దర్శించామని చెప్పినప్పుడు మనము నమ్మకం తప్పదు కదా!

ఇక ప్రత్యక్ష అనుభవం గురించి చూస్తే దేనినైనా మనం ఎలా చూస్తామో? అందుకు మొదట వస్తువు గురించి తెలియాలి! అంటే అది ఎక్కడ ఉందో మనకి తెలియాలి! లేకపోతే చూడటం అనేది జరగదు! ఇంకా రెండోది ఆ వస్తువును చూడాలి అంటే అది మనకి కళ్ళకి కనపడే దూరంలో ఉండాలి! మూడవది ఆ వస్తువును చూడాలి అంటే ఆ వస్తువు పై కాంతి ప్రసరించి… కాంతి పరావర్తనం చెంది మన కంటిని తిరిగి చేరాలి! అలాగే కంటి వెనుక గల రెటీనా అనే తెరపైకి కాంతికిరణం పడాలి! రెటీనా కు కలపబడిన నాడుల ద్వారా… మెదడులోని తత్సంబంధిత  భాగానికి వార్త అందుతుంది! అప్పుడు ఆ వస్తువును చూచిన అనుభూతిని పొందుతాము! కాబట్టి వస్తువుని చూడటానికి కాంతి అవసరం! ఇక నాలుగవది మన కంటి పరిస్థితి సరైన స్థితిలో ఉండాలి! అనగా గుడ్డివాడు చూడలేక పోవడానికి వాడి కంటి నిర్మాణ స్థితి సరైన స్థితిలో లేకపోవడం వల్లనే కదా! పైగా విచిత్రమైన విషయం ఏంటంటే దేనినైనా చూడటం అనేది ప్రయత్నం వల్ల సాధ్యపడుతుంది! ఉదాహరణకు మనం  గావాలని కళ్లు మూసుకుంటే…. దగ్గర్లో ఉన్న వస్తువును సహితం చూడలేము! ఒకసారి మన కళ్ళు తెరుచుకుని ఉంటాయి! కానీ మన కళ్ళ ఎదుట జరుగుతున్న వాటిని గమనించలేము! ఎందుకంటే మన మనస్సు దానిని చూచే ప్రయత్నంలో ఉండదు! కనుక చూడదలుచుకోలేదు! కాబట్టి చూడటం అనేది జరగడానికి కేవలం పైన చెప్పిన విషయాలే కాక మనస్సు కూడా ప్రధానమని గ్రహించాలి!

ఉదాహరణకు విద్యుచ్ఛక్తి ఉన్నది గదా! ఆ విద్యుత్తును మనం చూడలేము! అలాగే విద్యుత్ చూడలేకపోయినా దానిని ఉత్పత్తి చేయగలము! కొలవగలము! అలాగే దానిని మన ఆధీనంలో ఉంచుకోవచ్చును! కానీ మనము వీటిని చూడలేము కానీ వాటి వల్ల కలుగుతున్న కార్యాలను బట్టి అవి ఉన్నాయని నమ్ముతున్నాము! కాబట్టి మన కళ్ళు అన్నిటిని చూడాలనుకోవడం ఒక పెద్దభ్రమ! అలాగే భగవంతుడు కూడా ఒక వస్తువు కాదు! ఒక పదార్థం కాదు! కనుక మన కంటికి కనిపించే అవకాశం లేదు! భగవంతుడు మన ఆధీనంలో ఉండడు! ఆయనను మనం కొలవలేము! నియంత్రించలేవు! మరి భగవంతుడిని చూడటం ఎలా? ఇంతకు భగవంతుడు ఎక్కడ ఏ విధంగా ఉన్నాడో తెలుసుకుంటే కదా అప్పుడు భగవంతుడిని చూడటం అనేది చర్చకు అవకాశం ఉంటుంది!

 ప్రహ్లాదుడు చెప్పినట్టు ఎందెందు వెతికినా అందందే కలడు అని భగవంతుడు అన్నిటిలో ఉన్నాడు! మనం వెతికితే అనగా ప్రయత్నిస్తే ఆయనను చూడగలమని అర్థంతో ప్రయత్నం చేయాలి! ఎక్కడ వెతకాలి? అన్నపుడు ఉపనిషత్తుల ప్రకారంగా చూస్తే… అంగుష్ఠ మాత్రుడు పురుషుడు అంతరాత్మగా ఎల్లప్పుడూ వ్యక్తుల హృదయములో నివసిస్తు ఉన్నాడని చెప్పడం జరిగింది! అంటే పరమాత్మను మన హృదయంలో ఆత్మ గా ఉన్నాడని అర్థమవుతోంది! అంటే ఆత్మను చూడటం అంటే పరమాత్మను చూడటం అన్నమాట! మరి ఆత్మను చూడాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు… మనలో ఉన్న ఆజ్ఞాచక్రము లో ఉన్న త్రినేత్రము అనగా పీనియల్ గ్రంథి తెరుచుకోవాలి అన్నమాట! ఇది తెరుచుకోవాలి అంటే సాధకుడు యోగ సాధన చేసి యోగ సిద్ధుడై ఆత్మ సాక్షాత్కారమును పొందితే అనగా భగవంతుడిని చూడటం జరుగుతుందని నేను తెలుసుకున్నాను! 

సాధనలు తప్పక చేసి తీరాలి. భగవద్దర్శనం హఠాత్తుగా కలుగుతుందా ఏమిటి...? భగవంతుణ్ణి చూడలేకపోతున్నానే ఎందుకు... అని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. అప్పుడు నా మనస్సులో స్పురించింది అతనికి చెప్పాను. పెద్ద చేపను పట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నావు. అందుకు కావలసిన ఏర్పాట్లు గావించు. గాలం, ఎర అన్నీ సిద్దం చేసుకో. ఎర వాసన పట్టి చేప నీటి అడుగు నుండి పైకి వస్తుంది. నీళ్లు కదలడం నుండి పెద్ద చేప వస్తుంది అని తెలుసుకోవచ్చు.

వెన్న తినగోరుతున్నావు... పాలల్లో వెన్న ఉంది, పాలల్లో వెన్న ఉంది.... అని పదేపదే అనడంలో ప్రయోజనం ఏముంది. శ్రమ పడితేనే కదా వెన్న లబించేది. భగవంతుడు ఉన్నాడు.... భగవంతుడు ఉన్నాడు.... అని చెప్పడం వల్ల భగవంతుడిని దర్శించగలవా.... కావలసింది సాధనే....

లోకోపదేశార్దం జగజ్జననియే పంచముండి ఆసనం అదిష్టించి కఠోరమైన తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు పూర్ణబ్రహ్మ స్వరూపుడు. ఆయన కూడా లోకానికి మార్గం చూపడానికై రాధా యంత్రాన్ని రూపొందించి తపస్సు చేశాడు.కాబట్టి భగవంతుడుని చూడాలన్నా, అనుగ్రహం పొందాలన్నా సాధనలు తప్పక చేసి తీరాలి.

                                                                                                                   -శ్రీరామకృష్ణ పరమహంస



అంటే ఇది జరగలంటే మనకి ఆత్మ అంటే ఏమిటో...దాని స్వభావమేమిటో తెలుసుకోవాలని నేను తెలుసుకున్నాను! దానితో నేను ఆత్మ మీద పరిశోధనలు చెయ్యడము ఆరంభించాను!ఆ వివరాలు మీకు తెలియాలంటే...మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా! 




శుభంభూయాత్

పరమహంస పవనానంద

****************************************************

నీ యదార్ధస్వరూపమును దర్శిస్తే...భగవంతుడిని దర్శించినట్లే!

మాయ స్వరూపము వలన నేను వేరు...నువ్వు వేరు అనుకుంటున్నాము! ఈ పిల్లికి లాగా అన్నమాట! నిజానికి పులి అనేది పిల్లి యొక్క ఉగ్ర స్వరూపమే...ఈ రెండు ఒకే జాతివి! అందుకే మన పెద్దలు పిల్లిని గదిలో బంధించి కొడితే అది పులిగా తిరగబడుతుందని చెప్పడము జరిగినది! కాని పిల్లికున్న మాయ వలన తను వేరు...పులి వేరు అనుకుంటుంది! మనకి లాగా నేను వేరు - నువ్వు వేరు అన్నమాట!

ఎపుడైతే పిల్లి తన యదార్ద జ్ఞానమును పొందుతుందో...అపుడిదాకా అద్ధంలో పులి కనిపించేది కాస్తా తన యదార్ధ స్వరూపమును చూసుకొని ఆనందస్ధితి పొందుతుంది! అనగా మనము పొందే సమాధి స్ధితి లాగా…అంటే నిజ బ్రహ్మజ్ఞానం పొందితే...మనకున్న మాయ మాయం అవుతుంది! ఈ పిల్లికి లాగా...మన యదార్ద స్వరూపమును ఆత్మసాక్షాత్కర స్ధితి ద్వారా స్వానుభవానుభూతి పొందడము జరుగుతుంది! ఇదియే భగవంతుడిని చూడటము అవుతుంది!



2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. kalla tho anni chudalanukovatame brama ani vidhyuthu udhaharana bagundi..saadhana chesthene bhagavanthudi darshanam avthundani...appude trinetram therchukuntundi bhagavanthudini chudagalam ani...pilli laa kaakunda anni okkate ani thelsukovalani cheppatam bagundi...antha okkate..

    రిప్లయితొలగించండి